ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కవి జీవితములు

జెప్పఁబడినపని నెఱ వేర్చి తనప్రభునికడకు వచ్చి యతఁడుగాని అతనిభార్యగాని యింట నుండు పరికరములుగాని అచ్చో లేకుండుటచేత యజమాని పలాయితుఁ డయ్యెనని గ్రహించి అతఁ డున్న స్థలంబును గనిపట్టి అతనియింట నుండునొకఱాతిఱోలు పదుగురు మగవారైనఁ గదల్చలేనిదాని నూఁడబెఱికి నెత్తి కెత్తుకొని మఱునాఁడు సూర్యోదయమునకు బ్రాహ్మణునిఁ జేరి "ఏమయ్యా! నీవు సంసారివి కావా" నీయింటిలో నుండుసమస్తవస్తువులును జాగ్రత్త చేసికొని యేమికారణమున నీఱోలు వదలి వచ్చితివి. గ్రామమందు దొంగలభయము విశేషము గదా అని యిది తెచ్చితి నని పల్కె. దాని కాబ్రాహ్మణుఁడు వెఱగంది పేకి మనుష్యస్త్రీ కాదు. బ్రహ్మరాక్షసియో, కామినీగ్రహమో అయియుండును. అటులైన నిఁక జీవి తేచ్ఛ లే దని భయాక్రాంతుఁడై తలకట్టికొని పండియుండఁగా నపు డా బ్రాహ్మణునిభార్య పెనిమిటి నూరార్చి తాను పేకిచేతఁ బరిచర్యఁ గొని దాని నోడించెద నని పెనిమిటికి ధైర్యంబు చెప్పఁగా బ్రాహ్మణుఁడు కొంత తేఱెనఁట. పిమ్మట నాబ్రాహ్మణి తాను అభ్యంగనస్నానము చేయవలయుంగావున నుష్ణోదక ముంచు మని పేకిం గోరి తలకు తైలము రాఁచుకొని వెండ్రుకలు చిక్కు తీయించుకొని యూడినతలవెండ్రుకల చిక్కు పేకిచేతి కిచ్చి యీవెండ్రుకలం గొనిపోయి ఒక్కొక్కదానిచే తెగకుండా వీడఁదీసి కదురువలె నిలువంబడునట్లు తోమి తేవలె నని ఆజ్ఞ యొసంగె. అపుడు పేకి తలవెండ్రుకల తుట్టెను తీసికొని యొక యేటి యొడ్డునఁ గూర్చుండి యొకటియైనఁ దెగిపోకుండ నన్నిటిని వీడఁదీసి దూరదూరముగ నుంచి యొక వెండ్రుక నిలువంబెట్టుటకు గోటితో లాగిచూచెను. ఆ వెండ్రుక చుట్టుకొనిపోయెను. అది బాగుగ నుండలేదని దానిని నీటిలో ముంచి వులుసు పెట్టి మరలఁ దోమి గోటితో మఱియొకపర్యాయము లాగిచూచెను. అపు డది మఱిరెండుచుట్లు పడుటకుఁ జింతించి మఱియు మఱియు లాగి నిలువంబెట్టుడు నది మఱియును జుట్టుకొనిపోవుచుండ