62
కాశీమజిలీకథలు - మూడవభాగము
గూడ స్వాధీనము చేసికొని యాదేశములకుఁ గూడ బరిపాలనఁ గావింపఁ దొడంగెను.
ఒక్కనాఁడు మంత్రపాలుఁడు తనకకారణముగా మిక్కిలి యుపకారము చేయుచున్న జయభద్రునింజూచి వినయవిశ్వాసముతోఁ దమవృత్తాంత మెట్టిదొ చెప్పుమని యడిగిన సంతసించుచు హైమవతి సహింతుండై వచ్చి అతనికి నమస్కరించెను.
అప్పుడు మంత్రపాలుఁడు పుత్రికను గుఱుతుపట్టి పట్టరాని సంతోషముతోఁ గౌగలించుకొని కనుల నానందబాష్పములు గ్రమ్మ పెద్దతడవు సంతోషపారావారవీచికలం దేలుచు భార్యతో నా వృత్తాంతము జెప్పి సంతోషము కలుగఁజేసెను.
అప్పుడు హైమవతి తల్లిదండ్రులకు సంతసము గలుగఁజేయుచు వా రడిగినంత దన వృత్తాంత మాద్యంత మెఱుఁగ జెప్పినది.
మంత్రపాలునికి జయభద్రుడు అల్లుడని తెలిసినపిమ్మట గలిగిన యానంద మీపాటిది అని నుడువుటకు నలవికాదు.
పిమ్మట విధివిధానంబున మంత్రపాలుండు హైమవతికి జయభద్రుని కిచ్చి పాణిగ్రహణమహోత్సవము సేయించి తన రాజ్యమునకు నధిపతిగా నతనికిఁ బట్టాభిషేకము గావించెను.
అటు సంప్రాప్తరాజ్యభారుడై జయభద్రుండు రామభద్రుండు బోలె న్యాయంబునఁ బాలింపుచు స్వదేశాగతులైన బ్రాహ్మణులవలన నిత్యము సునీతి ఖ్యాతి మిక్కిలిగా వినుచు నాశ్చర్యపారావానిమగ్నుఁడై యవ్విధంబంతయుఁ బరీక్షింప నరుగదలచుకొన్న సమయంబున సుదేవుండను బ్రాహ్మణుడు ఆ రాజు గృహమున కతిథిగా వచ్చి అర్చితుండై కూర్చున్నతఱి జయభద్రుడు స్వాగతప్రశ్నపూర్వకముగా నతని కిట్లనియె.
పండితమండనా! భూమండలమున మీరు వీక్షింపని దేశములుండవుగదా! దేశాటనము పండితధర్మమే ఇప్పుడు సకలదేశములలో నెన్నఁదగు వదాన్యుం డెవ్వడు యెవ్వని గృహమున కరుదెంచి అతిథులు సంపూర్ణకాములై అరుగుచుందురు? అప్పుణ్యాత్మునిం బేర్కొనుమని అనుటయు నాసుదేవ భూదేవుండు సంతుష్టాంతరంగుండై యితని కిట్లనియె.
దేవా! దేవర కరుణావిశేషంబున నే చూడని దేశంబులు లేవు. బాల్యము మొదలు నాకు దేశాటనమే వృత్తిగనున్నయది. పుడమిఁగల దాతల అందరం బరీక్షించి చూచితిని కాని యీ కాలములో విదర్భదేశములో సునీతి అను సాధ్వీమణి వంటి దాత నెందును గనివిని యెఱుంగను.
ఆ సతీతిలకము పతి జయభద్రుఁ డెంత సంపాదనకర్తయో తెలియరాదు. ఆమె నిత్యము ఆర్తులకు గోటిరత్నమండలములు దానము చేయుచుండును. ఆ రత్నములు భూలోకములోనివి కావు. నా పాండిత్యమునకు మెచ్చుకొని నాకొక రత్నాల