284
కాశీమజిలీకథలు - మూడవభాగము
బారిపోయిరి. ఇంతలో వేనవేలు కొఱవిదెయ్యములు ఓంకారధ్వనులు సేయుచు దోడరా భైరవునితో వేడుక మాటలాడుకొనుచు బిశాచవాహితమైన శవాందోళిక మెక్కి అచ్చటికి వచ్చి పరచారిక విరచితమైన శల్యసింహాసనమున గూర్చుండి యిట్లు సంభాషించెను.
భూతరాజు - బైరవా! మనము దేశాటనము సేయ మొదలుపెట్టి సంవత్సరమైనది. పెక్కు శ్మశానములు ననేక గుహాంతరములు వేనవేలు కాంతారములు సూచితిమి. కాని యిట్టి మనోహరప్రదేశ మెందును జూచియుండలేదుగదా.
బైరవుడు - కాబట్టియే భేతాళు డీచెట్టు నునికిపట్టు జేసికొని విడువకున్నాడు. ఇది దేవర చెప్పినట్లుగా భూతభేతాళపిశాచాదులకు విశ్రమింప నుచిత్రప్రదేశమై యున్నది.
భూతరాజు - ఓహో భేతాళుని యునికిపట్టిదియేనా? అతండెందున్నవాడు మన కెదురుగా రాలేదేమి మనరాక అతనికిం దెలిసినదా?
భైరవుడు - నేను మహాశ్మశానమునుండియే వానికి నుత్తరము నంపితిని. అందినట్లు తిరిగి యుత్తరము సైతము వ్రాసియున్నాడు. ఆతం డేమిటికి రాలేదో తెలియదు.
భూతరాజు - ఏది యతండు వ్రాసిన యుత్తరము విప్పి చదువుము.
భైరవుడు - చిత్తము చిత్తము. అని యుత్తరము చదువుచున్నాడు. సకల భూతభేతాళపిశాచనిశాచర శిరోమణికిరణ నిరాజిత చరణయుగళుండైన భూతమహారాజుగారి చరణంబులకు వందనం బొనరించి సేవకుడు భేతాళుడు వ్రాసికొను విజ్ఞాపనపత్రిక. దేవరవారు అమాత్యబైరవునిచేత వ్రాయించిపంపిన యాజ్ఞాపత్రికంచదువుకొని పరమానందకందళిత హృదయారవిందుడనైతిని. అస్మన్నివాసమైన వటమహీరుహంబునకు దేవరవారు దయచేయుదివసంబునకు ప్రాయములో నున్న పెండ్లికాని క్షత్రియకన్యక కుత్తుక నులిమిన పచ్చినెత్తురుచే గాళికాశక్తిం దృప్తిపఱుపదలంచి యట్టి యువతిం దెచ్చి సిద్ధముగా నుంచవలయునని వ్రాయించితిరి? ఆ ప్రకారము గావించి దేవర యనుగ్రహమునకు బాత్రుడ నగుదునని విజ్ఞాపన జేయుచున్నవాడ. ఇట్లు తమ పాదసేవకుడైన భేతాళుడు.
భూతరాజు - (ఆయుత్తరము విని) ఓహో! దీనివలన దదీయభక్తివిశ్వాసములు తెల్లమగుచున్నవే. ఇట్టి యుత్తరము వ్రాసి యతం డేమిటికి నిలిచి ఉండలేదో తెలిసికొనుము.
భైరవుడు - చిత్తము చిత్తము, పలలప్రియా! యెందుంటివి. యిటురమ్ము.
పలలప్రియుడు - (ప్రవేశించి) దేవా! ఆజ్ఞయేమి? స్వామివారి పాదముల గనిపెట్టి యిందే యుంటిని
భైరవుడు - మనము భేతాళుని నివాసమునకు వచ్చితిమి. అతనిజాడ ఏమి