పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/247

ఈ పుట ఆమోదించబడ్డది

250

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఉ. చక్కదనాలకేమి రుచి సంపదఁ జిత్తురుబొమ్మయుం గడుం
     జక్కనగాదె యంత వెఱజాణతనం బొకచోట గానఁగా
     మక్కువ లోకమందె సహి మాటలపోడిమి దాని కేతగున్
     దక్కిన భామినీమణులు దాని శతాంశము బోలనేర్తురే.

అని పల్కుచు గన్నీరు విడచినం జూచి నేని వెరగుపడుచు అయ్యో! వీఁడుత్తమవంశంబునంజన్మించి కొరగాని చోరకృత్యములకు బూనుకొనుటయు నీచజాతి యువతిం గూడికొనుటయు చూడ మాతృదోషంబని తలంచెదను. ఈతఁ డా రుచిరయందు బద్ధానురాగుడై యున్నవాడు. వీనిదుర్వృత్తి నిప్పుడు మరలింప వశము గాదు. ముందు విచారించెదంగాక యిప్పుడెట్లయిన రుచిరను విడిపించుకొనివచ్చుటయే యుచితమని నిశ్చయించి అన్నా! నీవు విచారింపకుము రెండుమూడు దినములలో నిన్ను రుచిరతోఁ గూర్చెదనని శపథముఁజేసి యతని నోదార్చితిని.

అమ్మఱునాఁ డుచితకాలంబున విక్రమార్కుని యాస్థానమున కరిగితిని అందు రాజపీఠమున కనతిదూరములోనున్న రుచిరంజూచి యెంత సౌందర్యవతియో యనుకొంటిని. సామాన్యులలో సామాన్యగా నున్నది. దాని యౌవనప్రాబల్యమే వాని నాకర్షించినది. యథాప్రకారము నీవెవ్వతెవు? నీవృత్తాంతము చెప్పుము చెప్పకున్న నిన్ను దండింపక మానమని రాజభటులు తర్ఖింపుచుండ నాప్రోడ యేమియుం బలుకక మూగదానివలె నొక వ్రేలాకసమువంక జూపినది.

అట్టిసమయమున నేనులేచి రాజుదిక్కు మొగంబై దేవా! యీకాంతను మాటాడించినవారికి బారితోషిక మిప్పించితునని చాటి పించితిరి. నేను మాటాడించెదను. నాకిచ్చు పారితోషికమెద్దియా చెప్పుడని యడిగిన విక్రమార్కుడు నన్ను చూచి పరిశీలించుచు నీవెవ్వరి వాడవని యడిగిన నావార్తయంతయు బిమ్మట చెప్పెదను. కనుకమాట ముందు తెలుపుండని నేనొడివిని కానిమ్ము నీవేమికోరిన నదియే యిత్తునని ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు నేను సంతసించుచు నాకాంతయొద్దకు బోయి చెవులో నేను నీమఱిదిని. మాయన్న రాముఁడు నన్ను నిన్ను విడిపించుకొని రమ్మని యంపెను నీకేమియు భయములేదు. నీవిముక్తియే నేను రాజును వర మడిగెదను. ఇతండాడి తప్పువాడు కాడని నమ్మునట్లాకొమ్మకు బోధించి రాజు గారితో మీరీ యతివ నేమనియడిగెదరో యడుగుడని పలికితిని. అప్పుడు విక్రమార్క మహారాజు అప్పడంతి నిట్లడిగెను.

రాజు -- నీవెవ్వతెవు?

రుచిర - ఆఁడుదానను.

రాజు - ఎవ్వని కూతురవు ?

రుచిర - జనకుని కూఁతురను.

రాజు - ఎవ్వని భార్యవు ?

రుచిర -- జగదభిరాముని భార్యను.