పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

140

కాశీమజిలీకథలు - మూడవభాగము

అనియున్న పద్యంబుల జిరునగవుతో ముమ్మారు విస్ఫుటముగా జదివి యా రాజమార్తాండుండు పండితులపై జూడ్కి మెఱయఁజేయుటయు వారు ఏమేమి వెలయాలికింత గర్వమా యనువారును, రాయల యాస్థానకవీంద్రుల మహిమ యెఱుంగక యిట్లు వ్రాసినదనువారును, ఎచ్చటనో పండితుల గొందఱ జయించినదట ఆ జయపత్రిక లెట్టివో చూడవలయుననువారును, రూపముచే జీరి చెడి పడుపుపడంతులే పండితుల నోడించినచో నికేమియున్నదనువారును, యీ మారు దీని గర్వప్రాయశ్చత్తము చేసికొనుటకే యిచ్చటికి వచ్చినదనువారును, దీని బరిభవింపక విడువరాదనువారును, రాజుగారి నాశ్రయించు తలంపుతో నీరీతి బన్నిన దనువారును, పెక్కండ్రు పెక్కురీతుల సంభాషింప జొచ్చిరి.

అట్టి సమయంబున మఱియొక పరిచారకుడు జయపత్రికల పెట్టెనొకదానిఁ దీసికొనివచ్చి యా సభలో భూభర్త ముంగలబెట్టును. పత్రికల నాధాత్రీపతి వేరు వేరనిరూపించి చదివించిన నిట్లున్నది. "మేము మూడుదినములు నీతోశబ్దశాస్త్రములో వాదించితిమి. నీ ప్రశ్నలకు సదుత్తరము లీయలేక పోయితిమి, యోడితిమి. నీవే గెలిచితివి. తర్కములో నీ కెవ్వరును సాటిలేరు. కవిత్వముతో నిన్ను సరస్వతీయే యని కొనియాడదగినది. మేము నీకు జాలము మేమే కాదు సమస్త విద్యలలో నీకు జాలినవారీ పుడమిలోలేరు. అని ఈ రీతి పేరుబొందిన విద్వాంసులు వ్రాసియిచ్చిన పత్రికలం జదివించి యానరపతి వెరగుపడుచు అంతకుముందు అందు వ్రాసియిచ్చిన పండితుల ప్రఖ్యాతి వినియున్న కతంబున అప్పుడప్పడంతి అనన్యసామాన్యముగా దలంచి తన పండితులతో నిట్లనియె.

ఆర్యులారా! పండితుల విద్యాప్రసంగంబులను నాలింపవలయునని నా యంతరంగమున భావిసూచకముగా నుత్సాహముదయించినది. దానికి దార్కాణ మీ యుత్తరమే! అది యట్లుండె నాచేడియ విద్యలలో బలుప్రోడవలె దోచుచున్నది. దానికి జయపత్రికల నిచ్చిన విద్వాంసులెల్ల మన మక్కజముగా జెప్పుకొనువారే సుడీ. కావున దీని సామాన్యముగా నెన్నదగదు. దీని జంఝాటము వింతగానున్నది. మన మోడిపోయితిమేన అది యిచ్చటికి వచ్చిందులకైన సొమ్మిచ్చు కొనవలయునట. ఏమి దీని ధైర్యము . ఏమి దీనిగర్వము. దాని విద్యామదమే యిట్లు వ్రాయించినది. కానిండు దానిం బరిభవించనప్పుడు గదా మన మసూయపడవలసినది. ఖ్యాతియో అపఖ్యాతియో మనకా నాతివలన రావై యున్నది. ఇందులకు బ్రధానులు మీరలు గదా. ప్రచ్ఛన్నముగా దదీయవిద్యాబలవిశేషము లరసి దానినోడించు నుపాయము నిరూపించుకొనుడు. ఈ సంస్థానమున కపయశము రాకుండ గాపాడుకొనుడని పలికిన విని అందఱు డెందంబుల దలంప దొడంగిరి. అప్పుడు భట్టుమూర్తి సావలేపముగా లేచి యెల్లరువిన నిట్లనియె.

దేవా! దేవరవారి యాస్థానపండితుల మహిమ యెరుంగక అగ్గణిక యింతగా