లుబ్ధా-- దాన్ని పాడుచేస్తున్నావూ?
మీనా-- యిలాంటి మాటలంటేనే నాకు అసయ్యం. మీరు యక్కడో దడుసుకున్నారు కాబోలు; అంచేత దుష్టుకల వొచ్చింది. అంతేగాని, రెండోపెళ్లీ, మూడోపెళ్లి, అని, వెఱ్ఱులు వోడకండి. పూజారి గవరయ్యని పిలుస్తాను; అతగాడు యింత మంత్రించి వీబూదియిస్తాడు రాసుకుపడుకొండి.
లుబ్ధా-- కొంపతీస్తావా యేవిఁటి? వాడొస్తే, వాడితో యేవఁని చెప్పడం? దాన్నే నిజం అడుగుదూ.
మీనా-- నే నడగను, నాన్నా, నన్ను అడ్డవైఁన మాటలూ అంటూంటే, నే నెందుకు అడుగుతానూ? నేం దాంతో యిగమాట్లే ఆణ్ణు.
లుబ్ధా-- నాతల్లివికాదూ, అడుగమ్మా.
(మీనాక్షి పైకివెళ్లును.)
లుబ్ధా-- ఓ పన్నం యాకర బెట్టేదా? గాయత్రీ స్మరణ చేసేదా? వేదాలూ, మహామంత్రాలూ, యీ దెయ్యాలకి పేలపిండి వొడియాలు. శాపరమంత్రాలు ఉపదేశం అవుదావఁంటే, బెడిసి గొడతాయేమో అని భయం. యేవిఁసాధనం? "రామనామతారకం" స్మరణ చేస్తాను. "రామనామతారకం । భక్తిముక్తిదాయకం । జానకీమనోహరం । సర్వలోకనాయకం । రామనామతారకం । రామనామతారకం" యీముండ యింట్లోవుంటే, నే బతకను. "రామనామతారకం । రామనామతారకం" ॥ రుద్రాక్షతావళంయేదీ? (మంచము అంచునకూచుని పరుపుకింద తడివిఁ, రుద్రాక్షతావళం తీయుచుండగా మీనాక్షి ప్రవేశించి.)
మీనాక్షి-- మీమాట నిజవేఁ నాన్నా!
లుబ్ధా-- నిజవేఁ!
(మంచముమీదినుంచి కింద కూలబడును.)
మీనాక్షి-- (లేవదీసి) నాన్నా! నాన్నా! పడిపోయినావేవిఁ?
లుబ్ధా-- యేవీఁలేదూ. నిజవేఁ! నిజవేఁ!
మీనా-- నిజవేఁను. ఆమొగుడు యిప్పుడే దానిక్కూడా కనపడి, "ముండా, మళ్లీ పెళ్లాడావే? నీ కొత్తమొగుణ్ణి పీకపిసికేస్తాను చూడు" అన్నాట్ట.
లుబ్ధా-- అయ్యో! అయ్యో! రామప్పంతులు యిల్లు వొల్లకాడు కానూ! యక్కడ కల్పించాడే యీమాయపెళ్లి నాకోసం! వీడి పిండం పిల్లులికి పెట్టా! అయ్యో! అయ్యో! ఆమొగుడు వెధవ యలా వున్నాడందే?
మీనా-- వాడు రోజూ దానికి కనపడతాట్ట నాన్నా. వాడికి మీసాలూ, గిరజాలూ వున్నాయట, చావం చాయట.