రామ-- మర్యాదగా మాట్లాడితే, నా అంతమంచివాడు లేడు.
సిద్ధాం-- అవధాన్లుగారూ మీరు కూడా యిలారండీ.
(అవధాన్లు, సిద్ధాంతి, రామప్పంతులూ రహస్యముగా మాట్లాడుదురు.)
రామ-- (ఉత్సాహముతో) సిద్ధాంతీ యేదీ పొడిపిసరు. నియ్యోగపాడన్నవాడు, సవబుకి కట్టుబడతాడు. యవరయా వంటబ్రాహ్మలు! మాయింటికి ఫలహారాలు వెళ్లాయా? యేవోఁయి, కొండి భొట్లూ! మాట, యిలారా!
(కొండి భొట్లు వచ్చును.)
కొండి-- యేం శలవు?
రామ-- మాయింటిదాకా నాతోరా.
కొండి-- చిత్తం.
రామ-- మాతోట్లో, మంచి పనసకాయలున్నాయి. రెండుకాయలకి బరాతవిఁస్తాను. తెచ్చుకో మీ అయ్యకి పనసకాయ కూరంటే, మాయిష్టం.
కొండి-- చిత్తం!
రామ-- పెళ్లిలో యేవిఁటోయి గమ్మత్తు.
కొండి-- యేవీఁ గమ్మత్తు లేదండి.
రామ-- మధురవాణి పాడిందికాదేం?
కొండి-- పాడింది -
రామ-- ఆఁ!
కొండి-- కాదండి.
రామ-- అలాచెప్పు. అంతసేపూ హెడ్డు కనిష్టీబుతో మాట్లాడుతూంది కాబోలు?
కొండి-- లేదండి. ఒక్కమాటాళ్లేదు.
రామ-- మరెందుకన్నావూ, మాట్లాడిందని యిందాకానూ? విరగబడి నవ్విందన్నావే?
కొండి-- మరీ- మరీ- మరే వొచ్చి- లింగన్నగారి కాంభొట్లు అలా అనమన్నాడు.
రామ-- వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! నువ్వుమాత్రం వాడిజట్టు కూడకు. చిన్నప్పట్నుంచీ నిన్ను యెరుగుదును. నువ్వు నిజాయితీ మనిషివి.
కొండి-- అవుఁనండి. యెప్పుడూ నేను నిజవేఁ చెబుతాను.
రామ-- అవునుగాని, హెడ్డు కనిష్టీబుమాటమట్టుకు నిజం చెప్పావుకావు. పట్టాభిరామస్వావిఁమీద ప్రమాణంచేసి, చెప్పూ! మధురవాణి యవరెవరితో మాట్లాడింది?
కొండి-- మరేవచ్చి- నిజం చెప్పమన్నారూ?
రామ-- నిజాయితీ మనిషివనేగదా నిన్ను అడుగుతున్నానూ?
కొండి-- అయితే, - అందరితోటీ మాట్లాడింది.