ఈ పుట ఆమోదించబడ్డది

రామ-- మర్యాదగా మాట్లాడితే, నా అంతమంచివాడు లేడు.

సిద్ధాం-- అవధాన్లుగారూ మీరు కూడా యిలారండీ.

(అవధాన్లు, సిద్ధాంతి, రామప్పంతులూ రహస్యముగా మాట్లాడుదురు.)

రామ-- (ఉత్సాహముతో) సిద్ధాంతీ యేదీ పొడిపిసరు. నియ్యోగపాడన్నవాడు, సవబుకి కట్టుబడతాడు. యవరయా వంటబ్రాహ్మలు! మాయింటికి ఫలహారాలు వెళ్లాయా? యేవోఁయి, కొండి భొట్లూ! మాట, యిలారా!

(కొండి భొట్లు వచ్చును.)

కొండి-- యేం శలవు?

రామ-- మాయింటిదాకా నాతోరా.

కొండి-- చిత్తం.

రామ-- మాతోట్లో, మంచి పనసకాయలున్నాయి. రెండుకాయలకి బరాతవిఁస్తాను. తెచ్చుకో మీ అయ్యకి పనసకాయ కూరంటే, మాయిష్టం.

కొండి-- చిత్తం!

రామ-- పెళ్లిలో యేవిఁటోయి గమ్మత్తు.

కొండి-- యేవీఁ గమ్మత్తు లేదండి.

రామ-- మధురవాణి పాడిందికాదేం?

కొండి-- పాడింది -

రామ-- ఆఁ!

కొండి-- కాదండి.

రామ-- అలాచెప్పు. అంతసేపూ హెడ్డు కనిష్టీబుతో మాట్లాడుతూంది కాబోలు?

కొండి-- లేదండి. ఒక్కమాటాళ్లేదు.

రామ-- మరెందుకన్నావూ, మాట్లాడిందని యిందాకానూ? విరగబడి నవ్విందన్నావే?

కొండి-- మరీ- మరీ- మరే వొచ్చి- లింగన్నగారి కాంభొట్లు అలా అనమన్నాడు.

రామ-- వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! నువ్వుమాత్రం వాడిజట్టు కూడకు. చిన్నప్పట్నుంచీ నిన్ను యెరుగుదును. నువ్వు నిజాయితీ మనిషివి.

కొండి-- అవుఁనండి. యెప్పుడూ నేను నిజవేఁ చెబుతాను.

రామ-- అవునుగాని, హెడ్డు కనిష్టీబుమాటమట్టుకు నిజం చెప్పావుకావు. పట్టాభిరామస్వావిఁమీద ప్రమాణంచేసి, చెప్పూ! మధురవాణి యవరెవరితో మాట్లాడింది?

కొండి-- మరేవచ్చి- నిజం చెప్పమన్నారూ?

రామ-- నిజాయితీ మనిషివనేగదా నిన్ను అడుగుతున్నానూ?

కొండి-- అయితే, - అందరితోటీ మాట్లాడింది.