56
కాశీమజిలీకథలు - పదియవభాగము.
క. నీయందము చందము గని
యూయిందుముఖీవతంస యాసించెఁగదా
పో యిఁక వానరవదనుఁడ
వై యటునినుఁజూచి సకియ యానందించున్.
నిన్ను మగనిఁగాఁ జేసికొనుతలంపుతో నన్నవమానించిన యారాజపుత్రిక కిదియశిక్ష నీకోతిమొగంబుఁ జూచి యిటుపై నెట్లుచేయునో చూచెదంగాక! అనిశపించినవిని నారదుండు ఔరా! పర్వ తా! స్వల్పాపరాధమున కే నన్నిట్లుశపింతువురా! అసూయాపరతత్వముగాక దీననీ కేమివచ్చెడిని? కానిమ్ము. ఇందులకుఁ బతిఫలం బనుభవింతువుగాక యీమర్త్యలోకనివాసమే నీకు శాశ్వతమగుఁగాత. ఇఁకనీకు నాకలోకాలోకన సుఖం బాకాశకుసుమంబగు పోపొమ్ము. నీసహవాసంబు దోషప్రదంబని నారదుండు క్రమ్మఱశపించెను పర్వతుండు పశ్చాత్తాపము జెందుచు విచారముతో నెందేనింబోయెను.
నారదుండు వానరముఖుండై సిగ్గుతో నాఁడు రాజపుత్రిక మొగముజూడక మార్మొగముపెట్టుకొని వాడుకప్రకారము వీణం బాడుచుండెను. దమయంతి యంతికమునఁ గూర్చుండి యాకర్ణింపుచు హఠాత్తుగా నతని మొగముజూచి మునీంద్రా! మీ మొగంబునకు మసి బూసికొనిరా యేమి? అట్లునల్ల పడినదే! అని యడిగిన నతండులజ్జావనత వదనుండై యిదియొక ప్రారబ్ధమని యుత్తరము చెప్పెను. అవ్వనిత తత్కారణము తెలియక పరితపించుచు నతండు తన్నుఁజూడ సిగ్గుపడు చున్నాడని యెఱింగి యక్కొరంత పాటింపనట్లభినయించుచు మునుపటి కంతె నెక్కువప్రీతితో నాలించి శుశ్రూషచేయుచుండెను. నారదుఁ డాత్రముతో నప్పద్మనేత్రమొగము మొగమెత్తి చూడలేకుండెను.
సృంజయుండు పుత్రికకు వివాహప్రయత్నము చేసి కొందఱ రాజపుత్రుల చిత్రఫలకములఁ దెప్పించి వారిలో నిచ్చవచ్చినవాన్ని