పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/380

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగన్మోహినికథ.

371

చారుమతి — కశ్యపుండే పరమోత్తముఁడని నే నభిప్రాయ మిచ్చుచున్నాను.

ప్రఫుల్ల - ఆమాటయే నేనును బలుకుచున్నాను.

కాళింది – అక్కా! నీవు మఱచిపోయితివిగదా! వినుము.

క. గోదావరి తనపేరిట
   మేదిని వెలయించినట్టి మేటి యాహ
   ల్యా దయితుఁడు గౌతమముని
   వేదండుం డధికుఁ డనుచు వివరింపఁదగున్.

రుక్మవతి — అక్కలారా ! నాకుఁ దోచినమాట నేనునుం జెప్పెద నాకర్ణింపుఁడు.

గీ. వసుధరాజిషిన్ యయ్యు దుర్వారభూరి
    వర తపఃప్రథితప్ర భావప్రభూతి
    సృష్టికిని వేరుసృష్టి జేసిన ఘనుండు
    కౌశికునిబోలు తపసి యొక్కరుఁడు గలఁడె.

మహారాజరత్నము - అక్కా ! రుక్మవతీ! ఇందఱు మహర్షులుండ నీమది కా పరమక్రోధనుండు మెప్పువచ్చెనా ? అక్కటా! నిత్యసత్యవ్రతుఁడైన యాహరిశ్చంద్ర మహారాజు నతండు పెట్టిన చిక్కులు తలంచిన నెంత కఠినాత్మునికైనఁ గన్నీరు రాకమానదు గదా ! నిజముగా విమర్శించినచోఁ

చ. వనజభవప్రసూతి రవివంశభవక్షితిపాల దేశికుం
    డనుపమ కీర్తివాసిత దిగంతుఁడు శాంతుఁ డరుంధతీ మనో
    వనజ దివాకరుం డురుతపః పరితోషిత సర్వదేవతా
    ప్రణుతుఁడు జ్ఞానమూర్తి మునివర్యుఁ డనంగ వసిష్ఠుఁడేకదా.

ఇమ్మహాత్ముని తపఃప్రభావముజూచి యోర్వలేకయేకాదా విశ్వామిత్రుఁడు మహర్షియగుట.