పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/377

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

కాశీమజిలీకథలు - పదియవభాగము.

నగరముగానే యున్నదఁట. దీని వర్ణింపఁ బెద్దకాలము పట్టును. ఏవీధి కావీధియే యొక పట్టణమని చెప్పవచ్చును.

దైవకృపచే మన మేగురము మంచిభార్యలం బడసితిమి. అమితధనము సంపాదించితిమి. మఱియు నీస్త్రీ రాజ్యము మన యధీనమైనది. మన మిప్పుడు భార్యల వెంటఁబెట్టుకొని యన్నలవలె నింటికిఁబోయి తలిదండ్రులకు సోదరులకు ప్రజలకు నానందము గలిగింతము. మన దక్షిణదిగ్యానము గూడ గొంత సఫలమైనదని చెప్పుకొనవచ్చును. మనదేశమునకుం బోవుదమా? అని చెప్పిన నామాట కందఱు సమ్మతించిరి. తమతమ భార్యలకు వారివారి యాప్తులకు నావార్తఁ దెలియఁజేసి శుభముహూర్తంబునఁ బయనంబై యా రాజ్యంబు మంత్రులు బాలించునట్లు నియమించి చతురంగబలములు గొలువఁ గతి పయప్రయాణంబులం గన్యాకుబ్జనగరంబు ప్రవేశించి తలిదండ్రులకు సోదరులకుఁ దమ వృత్తాంతమంతయు నెఱింగించి సంతోషసాగరంబున మునుంగఁ జేసిరి.

అని యెఱింగించి.. .మణిసిద్ధుం డిట్లనియె.

___________

243 వ మజిలీ.

మునుల తారతమ్యము.

గీ. తన కుటంబంబు తామరతంపరగను
    నల్లుకొన వేనవేలకు నిధికమగుచు
    తనదు నామము సార్థకత్వము వహింప
    నలరె సౌభాగ్యసుందరి యధికమహిమ.

ఇరువదిమంది కుమారులును దిగ్విజయంబుజేసి లోకాతీత సౌందర్యంబునఁ బ్రకాశించు నించుబోడ్లం బెండ్లియాడి యింటికివచ్చిన తరువాతఁ గొడుకులును గోడండ్రును మనుమలు మునిమనుమలులోన