మణిమంతునికథ.
331
నేలం బండుకొంటిని. అంతలో నాకు భగవంతుఁడొకయూహ తోపించెను. గడియ యాలోచించి యది మంచిదని నిశ్చయించుకొని యట్టె లేచితిని. అప్పుడే యావార్త నలుమూలలు వ్యాపించుటచే దూర్యారవములు మ్రోగించుట మానివేసిరి. నేను వాని నాపవలదని తెలియఁజేసి యాయుత్సవములోఁ బెండ్లిపందిరిలోనున్న ప్రేక్షకులనెల్ల నుపలక్షించుచు నాలుగుతేప లిటునటు తిరిగితిని.
నాపుణ్యవశంబున నొకచోట మేజువాణీజూచుచున్న యొక చిన్నవాఁడు నాకుఁ గన్నులపండువు గావించెను. విశాలములగు నేత్రములు చంద్రబింబమువంటి మొగము, ఆజానుబాహువులు. పెద్ద యురముగలిగి తేజస్ఫూర్తితోనొప్పు నాపురుషుని చేయిపట్టుకొని రమ్మని చీరుచు అబ్బాయీ! నీ వేకులమువాఁడవని యడిగితిని. అతఁడు ద్విజకులుండనని యుత్తరముచెప్పెను. ఇక మఱేమియు నడుగక సంతోషముతో నతని లోపలికిఁ దీసికొనిపోయి నీకు నాకూఁతు నిచ్చి వివాహముగావించెద నంగీకరింతు వేయని యడిగితిని. అతఁడు చిఱునగవుతో నంగీకరింపకేమి ? అని యుత్తరమిచ్చెను.
అప్పుడు నేను వీఁడే నాయల్లుఁడని యందరకుఁ దెలుపుచు దీసికొనిపోయి నాభార్య కత్తెరంగెఱిఁగించితిని. తద్రూపాతిశయమునకు మెచ్చుకొనుచు నాభార్య నే నీమాట మొదటనే చెప్పితిని. ఎక్కడో సముద్రమధ్యములోనున్న దీవిలోఁ గాపురముసేయు కోటీశ్వరుని కుమారుఁడఁట ఎన్నఁడు చూడని సంబంధము తెచ్చిపెట్టితిరి. దైవము మనకిప్పు డనుకూలుఁ డే! మొదటనే యోడ మునిఁగినది. పెండ్లి చేసిన తరువాత మునిఁగిన నేమిజేయుదుము! తప్పక వీనికే పెండ్లి చేయుమని బోధించినది. బంధువులందరు సమ్మతించిరి. బ్రాహ్మణులుత్తమలక్షణుఁడని మెచ్చుకొనిరి. ప్రేక్షకు లుత్సాహపడిరి.
పురోహితుఁడు తొందరపెట్టగాఁ బుణ్యస్త్రీ లప్పుడే వాని