320
కాశీమజిలీకథలు - పదియవభాగము.
శ్లో. శుక్లేవామకరోఁజ్ఞేయః అసితో దక్షిణఃకరః
కనిష్టమూలమారభ్య రేఖాః పంచదశస్మృతాః.
అంగుష్టస్యోర్ధ్వరేఖాంతాః స్మృతాః ప్రతిపదాదిషు,
ఎడమచేయి శుక్లపక్షమనియుఁ గుడిచేయి కృష్ణాపక్షమనియు జిటికెనవ్రేలి మొదటిరేఖ మొదలుబొటన వ్రేలి తుదిలేఖవరకు బదియేను రేఖలు పదియేను తిధులుగాఁ దెలిసికొనవలయునని సాంకేతికము. ఎడమచేయి అనగా శుక్లపక్షము, మధ్యాంగుళి నడిమి రేఖ యన నష్టమి, శుద్ధాష్టమినాడు రాత్రి తిరుగా రమ్మని సూచనయని గ్రహించి యతం డట్టే యాలోచించి నేనంతకాలంబుదనుక నిలువను. అనామిక నడిమి రేఖకే (పంచమినాటికి) రాఁగలను. అని ప్రత్యుత్తర మిచ్చెను?
ఆ వేశ్య మిగుల సంతసించుచు నతండు తన ప్రశ్నములకు సమాధాన మిచ్చిన ట్లొప్పుకొని నాఁడు వచ్చుట కంగీకరించి యంపినది.
పుష్ప కేతుం డింటికిఁబోయి యావారాంగననోడించినందులకు సంతసించుచు సౌమ్యుని విడిపించి పిమ్మటఁ దక్కిన తమ్ముల జాడఁ దెలిసికొనియెదనని నిశ్చయించి మూడుదినము లెట్లో గడిపి పంచమి నాఁడు సాయంకాలమునకు మహారాజరత్నము నింటికడకుబోయెను.
అంతకుముందే యిందుముఖు లిరువు రతనినిమిత్తమందు వేచియుండిరి. అతని జూచినతోడనే రండు రండని పలుకుచు నొకతె పాదములు కడిగి తడియొత్తినది. ఒకతె నివాళి యిచ్చినది. ఇరువురు నతని సగౌరవముగా లోపలకుఁ దీసికొనిపోయి వెనుకటి గదిమీఁదుగ ననేక కక్ష్యాంతరములు దాటించి యొక రాజసౌధములోనికిం దీసికొనిపోయి రత్నపీఠంబునం గూర్చుండఁ బెట్టిరి. ఆగది యలంకారము జూచి యతం డిది వేశ్యాసదనము కాదు. రాజభవనమువలె నున్నది.