పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుముఖునికథ.

269

నమ్మకముతో వారు ధరింపఁదగిన నూత్నాంబర మాల్యానులేపనాది వస్తు విశేషంబులందెచ్చి యుండిరి. కావున వానినెల్ల నాగుడిలో నొకచోటనునిచి యద్దేవికి మ్రొక్కి త్రిదివంబున కరిగిరి.

అనియెఱిఁగించి.....మణిసిద్ధుం డిట్లు చెప్పందొడంగెను.

___________

236 వ మజిలీ.

సావిత్రి కథ.

విక్రముం డావిగ్రహము పాదపీఠము చాటుననుండి యాదేవ కాంతల సౌందర్యాతిశయంబు కన్నులార నాలోకించెను. ముఖమంటపపు వేదికపైఁ గూర్చుండి వారాడుకొనిన మాటలన్నియుఁ జెవులార నాకర్ణించెను. వారి హృదయాశయముల మనసార గ్రహించెను. ఆనందసాగరమున నీదుచు న త్తరుణులు దివమున కరిగినవెనుక వారు ముఖమంటపములో దాచిన మాల్యాను లేపనవస్త్రాలంకారాదులఁ బరికించి యవి చతుర్విధముగా నుండుటకు ననుమోదించుచు మనంబున నేదియో క్రొత్తసంకల్ప మావిర్భవింపఁ దటాలునఁ దదంగరాగవాసితములగు తటాకజలంబులఁ గ్రుంకులువెట్టి తదామోదమోదితనాసా పుటుండై సూర్యోదయమగుచుండ సావిత్రి నారాధించి జులంబులం గ్రోలి తృప్తుండై యాత్మగతంబున నిట్లు తలంచెను.

నాకిది స్వప్నమో భ్రాంతియో నిజమో యింకనుం దెలియకున్నది. సూర్యుండు నెండయుఁ గనంబడుచుండఁ గన్నులు తెరువబడి యుండ నిద్రలేనిదే స్వప్న మెట్లువచ్చును! ఒకప్పుడు కలలోనే మెలకువవచ్చినట్లు తోచుచుండును. ఇది యట్టి యవస్థయేమో యేమైన నేమి? కలలో గాయత్రిసేవ దేవకాంతదర్శనము దివ్యకుసుమవాసనాసంప్రాప్తి లోనగువిషయంబులఁ జూచుటఁ గల్యాణప్రదమేకదా.