262
కాశీమజిలీకథలు - పదియవభాగము.
నాటంక పెట్టలేకపోయిరి. ఇఁక ముందుఁ గావింప దగిన కార్యమేమి? రేపే గరుడుఁడువచ్చు దివసము. వార్తగూడ వచ్చినదిగదా స్వర్గమున కరిగిన సుముఖుని మన మిపుడు రప్పింపఁజాలము. ఉన్న వారిలో నతని కాహారమగువారెవ్వరో తెలుపవలసియున్నది.
తక్షకుఁడు - ముందరినెలలో నెవ్వరింటికి వంతున్నదో యా యింటిపురుషు నీనెలకు మార్పవలయునని నే నభిప్రాయమిచ్చుచున్నాను.
ధనంజయుఁడు -- (పత్రికం జూచి) కర్కోటకు నింటికి వంతువచ్చినది.
తక్షకుఁడు - కర్కోటకా! ముందరినెలలో మీయింటి వంతఁట, ఆవంతు రేపటికి మార్చఁబడినది. రేపటి భక్ష్యవస్తువును దెచ్చెడు బాధ్యత నీమీఁదం బెట్టబడినది. తెలిసినదియా?
కర్కోటకుఁడు - ఎప్పటికప్పుడు మార్చుటకు మీయిష్టమే? మావాండ్రుమాత్రము పెండ్లికిఁ బోలేదా? మా వంతు ముందరి నెలలోనున్నది. యిప్పుడు నే నెవ్వరింబంపఁజాలను.
ధనంజయుఁడు -- పంపకున్న దప్పునా? పాపము సుముఖుని కిది వంతు సమయముకానేకాదు. గరుత్మంతుఁడు వానింజూచి కోరి కొనుటచే నట్లు వంతువేసితిమి. మొదటివంతు కర్కోటకునిదే.
కర్కో - చాలుజాలు ఆపట్టిక నీకడనున్నదని మిట్టిపడుచున్నావు. మొన్న సుముఖుని వ్రాసి యిప్పుడు నాపేరు వ్రాసిన నేనొప్పు కొందునా? ఆనింబధనము పోయినది, మఱియొకనికి వంతుమార్పుఁడు.
ధన - ఇంకొకఁడు మాత్రమొప్పుకొనునా! దీనింబుచ్చికొని నీవే మిట్టిపడుము. (అని యాపట్టిక నతనిపైఁ విసరుచున్నాఁడు. )
కర్కో.- నాప్రతాప మెఱుంగుదువా? వాసుకి శేషప్రముఖులకే వెరువను. నీవా నన్ను గద్దించువాఁడవు?