పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/262

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుణకేశినికథ.

249

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ యవ్వలి నెలవున నిట్లు చెప్పందొడంగెను.

________

234 వ మజిలీ.

గుణకేశినికథ.

చెలులారా! వినుండు. మాతండ్రి మహేంద్రుని సారధి మాతలి పేరు మీరు వినియుందురు. అతనికి లేక లేక చిరకాలమునకు గుణకేశిని యను కూతురు పుట్టినది. ఆబాలికామణిసౌందర్య మిట్టిదని వర్ణింప శేషునికైన శక్యముకాదఁట. త్రిభువనాశ్చర్యకరమగు చక్కఁదనంబుననొప్పునక్కన్యకామణికి వివాహముజేయ నిశ్చయించి మాతలి భార్యతో నాలోచించి వరాన్వేషమునిమిత్తము మాతండ్రి వలన సెలవుబొంది తొలుత స్వర్గపట్టణమంతయుం దిరిగి సురగరు డోరగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ కిన్నర కింపురుషాది దేవతా నగర విశేషములఁ బరికించి రూపయౌవనవిద్యామదగర్వితులగు వారి వారి కొమరులం జూచి తనకూఁతునకుఁ దగినవారు కారని నిశ్చయించి తిరుగా నింటికివచ్చి భార్య కత్తెఱం గెఱింగించెను.

అతనిభార్య మనోహరా ! మీతో మొదటనే చెప్పవలయునని తలంచితిని. చక్కఁదనముమాట యటుండనిండు, దేవజాతియం దొక లోపమున్నది. క్రొత్తసంతతి గలుగదు. ఎప్పుడు నొక్క పోలిక వారే యుందురు. నూత్నయౌవనముగల సౌందర్యవంతులు మందున కైనఁ గానరాదు. ఎప్పుడును ప్రాఁతబొందలే కావున మన గుణకేశినికి వేల్పులు పనికిరారు. భూలోకంబున కరిగి యభినవయౌవనమునం బ్రకాశించు రాజకుమారులఁ బరిశీలించి తగినవాడున్నఁ దీసికొనిరండని నియమించినది.