పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/247

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

కాశీమజిలీకథలు - పదియవభాగము.

గ్రహించి స్వామీ! కల యసత్యమైనను గలలోనున్నప్పుడప్పటి చర్యల ననుసరించి సుఖదుఃఖములు గలుగుచుండును. నాప్రవృత్తియునట్టిదే యనుకొనుఁడు. మీరు నవ్వినకారణము గ్రహించితినా! కరుణించి యవ్వలి కథ జెప్పుఁడని వేడుకొనియెను. అప్పుడు వేళమిగులుటయుఁ బయిపయనము సాగించి యతిపతి పై మజిలీయం దవ్వలి వృత్తాంత మిట్లు చెప్పం దొడంగెను.

_________

233 వ మజిలీ.

దేవకన్యకలకథ.

గీ. జలధి మునిఁగిన బావక జ్వాలఁ గూలి
    నను మహీధ్రమునుండి దొర్లినను బుడమి
    ఫణులచే బల్మిఁ గరవంగఁబడినఁ జావఁ
    డాయు వించుక మిగిలిన యతఁడు జగతి.

సముద్రపుటోడలకుఁ బ్రమాదమువచ్చునప్పుడు దప్పించుకొనుటకై ప్రక్కను జిన్నదోనెలంగట్టి యుంచుదురు. గనికిఁ దగిలి గుభాలునఁ జప్పుడై యోడమునుఁగుటయు నరనిమిషములో జరిగినది అప్పటికి రాత్రిజాము ప్రొద్దుపోయినది. అందున్న వారికి సాధనములఁ జూచుకొనుటకైన నవకాశము గలిగినదికాదు. అందు విక్రముడున్న యోడ శకలములై మునింగినది. ప్రక్కగట్టఁబడిన జిన్నదోనెలు దానితో విడిపోయి సముద్రజలంబునఁ దేలి కొట్టుకొని పోవుచుండెను. దైవికముగా విక్రమునిచేతికొక దోనెదొరకినది. అది ప్లవమువంటిదే. నీరెక్కినను మునుఁగదు. తెప్పకంటెఁ బెద్దదిగానుండును విక్రముఁడు. దానిపై కెక్కి కూర్చుండి యించుక యాయాసముదీరిన వెనుకవెన్నెల గాయుచున్నది. కావున నలుమూలలు పరికించి పొంగుచున్నసముద్ర