228
కాశీమజిలీకథలు - పదియవభాగము.
నిలిచి చూచుచుండిరి. అప్పుడు సిగ్గుపడి తలవంచికొనియున్న శ్రీధరుని చేయిపట్టుకొని శ్రీముఖుం డిట్లనియె.
చ. బలములు మేటిగుఱ్ఱములు భద్రగజంబులు లేవు శీలముం
గులమును రాజ్యసంపద లగోచరముల్ ప్రభవం బదెట్టిదో
తెలియ దనర్హులంచు మముఁ దేలికజేసి వచించి తా సభా
స్థలి దరిజేరకుండ వసుధాధన ! జ్ఞాపకమున్న దే మదిన్.
చ. ఇపుడు గ్రహించినాఁడవె? మదీయపరాక్రమశీలవృత్తముల్
నృపవర! యర్హులంచపుడు నీసభజేర్చిన రాజనందనుల్
త్రపయొకయింతలే కనుఁ బరాజ్ముఖులై చనిరేమి? నీప్రతా
పపువిభవంబువోవ నిటు పట్టువడం బనియేమి? చెప్పుమా?
క. పోలఁగ నీవెంతటి బల
శాలివొ యని తలఁతు మొక్కక్షణమనిసేయం
జాలితివి కా విదేమి నృ
పాలా ! యీమాత్రమున కే పలికితివటు మేల్ .
క. నీకూఁతుం గైకొనఁగా
మాకర్హ తగలదె తెల్పుమా యిపుడైనం
గాకున్న విడిచివైతుము
భూకంతా ! యనుడు సిగ్గుఁబొందుచు నతఁడున్ .
తలవంచుకొని మహాత్ములారా! మాచరిత్రము తెలియక కేవలము పత్రికలో వ్రాసినవిషయంబులం జదివికొని చులకనగాఁ జూచి యట్లాజ్ఞాపించితిని. నన్ను మన్నింపవలయు. మీరుత్రిలోకైకవీరులు.. మాపుణ్యవశంబుననిందు వచ్చితిరి. అయత్నోపలబద్ధముగా మీతో మాకు సంబంధము గలిగినది. మేము ధన్యులము. మీరు నన్ను జయించితిరని యించుకయు విచారములేదు. సంతోషమే కలుగు చున్నది. మాకమలాదేవి రాక్షసవివాహంబున మీచే స్వీకరింపబడి