పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/227

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీకథలు - పదియవభాగము.

స్వ స్వరూపముల దాల్చిరి. ప్రఫుల్ల నాపుత్రిక. కాళింది మంత్రి పుత్రిక. రుక్మవతి సామంతరాజు పుత్రిక . మీతమ్ములపోలిక గ్రహించుట గ్రొత్తవారికి గష్టముగానుండును. కావున వారేయెవ్వరేకన్యక యంతఃపురమున వెలసిరో యకన్యకం బాణిగ్రహణము జేసికొనవలయును. ఇది మాయభిలాష యని వినయముతోఁ బ్రార్థించుటయు హరివర్మ యంగీకారము సూచించెను.

అంత నమ్మహారాజు శుభలగ్నంబునఁ గళాభిరామునకుఁ దన పుత్రిక , ప్రఫుల్లను, మంత్రిపుత్రిక కాళిందిని సుధర్మునకు , రుక్మవతిని సులోచనుసకు యిచ్చి వివాహము గావించెను. మరియు నవంతీశ్వరుఁడు దూరమందున్న వాఁడగుటఁ జారుమతీకన్యాదాన సంస్కారము తానే గావించెను.

రామలక్ష్మణ భరతశత్రుఘ్నులుపలె నా రాజకుమారులు నలువురు నేకకాలమున వివాహ మహోత్సవముల నానందించి భార్యలతోఁ గూడఁ గొన్నిదినంబు లందు నిరవధిక కేళీవిలాసములతో వెళ్ళించిరి.

అని వినిపించి తరువాతనగు కథ నిట్లు వచియించెను.

230 వ మజిలీ.

రాజపుత్రులు నిత్యము స్వదేశమున కరుగఁ దొందరపడుచున్నను సోమదత్తుని నిర్భంధమునఁ గొన్ని నెల లాగిరివ్రజపురంబున నుండక తీరినదికాదు. అక్కడినుండి కాశ్మీరదేశమునకు మార్గము కడు సంకటముగా నుండును. ఆదేవకూటశైలము తిరిగిపోవలయును. మంచి దారులులేవు. కొండలనడుమనుండి యడవులమీఁదుగాఁ బోవలయును.

సోమదత్తుఁడు సుముహూర్తమున వారికిఁ బ్రయాణము నిరూపించి దాసదాసీసహస్రము లరణముగా నిచ్చి యేనుఁగులు గుఱ్ఱములు లొట్టియలమీఁదను సారెవస్తువు లెక్కించి పుత్రికల నందలము లెక్కించి చతురంగబలముల సహాయమిచ్చి యంపకము గావించెను.