పుట:Jajimalli by Adivi Bapiraju.pdf/140

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుచ్చి వెంట్రావుకు పద్మావతి అవసరం లేదు. నరసింహమూర్తి మేష్టారూ అవసరంలేదు అనిపించింది.

రాధాకృష్ణకు సుశీల అంటే నమ్మకమే! మలబారు నాయర్లమ్మాయి. సంగీతమూ నాట్యమూ తిరువాంకూరులో నేర్చుకుని, మద్రాసులో భరతనాట్యంలో అందెవేసిన చేయి కావాలని ఆ మహానగరం వచ్చింది. మదరాసులో కామాక్షీశ్వర పిళ్ళెదగ్గిర తంజావూరి విధాననాట్యం నేర్చుకునే రోజుల్లో రాధాకృష్ణ కామాక్షీశ్వర పిళ్ళె ఇంటికి వచ్చినాడు. కామాక్ష్మీశ్వరపిళ్ళెకు అతడు శిష్యుడు.

రాధాకృష్ణ తనగతి ఏమిటి అని పదేళ్ళ క్రిందట తటపటాయించే రోజుల్లో కొంతకాలం కూచిపూడి వెళ్ళి, నాట్యం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళు వేదాంతం లక్ష్మినారాయణగారికి శిష్యుడయ్యాడు. అతడు ఆడవేషంవేసి నాట్యం చేస్తే ఆడవాళ్ళ నాట్యంకన్న, అతని నాట్యం బాగుంటుందంటున్నారు. “వేషము స్థానం నరసింహారావుగారి చిన్ననాటి ఆడవేషం అంత బాగుంటుంది.” అని ఒక నాట్యకళా విమర్శకుడు వ్రాసినాడట. ఆ వెనుక తంజావూరి విధానంకోసం అతడు మదరాసు వచ్చి కామాక్షీశ్వరపిళ్ళెకు శిష్యుడయ్యాడు. అక్కడ తోటి శిష్యురాలైన సుశీలతో ఈతనికి పరిచయం గాఢమైనది.

సుశీలకు ఆమె ఇంటిదగ్గర కూచిపూడి నాట్యం నేర్పినాడు. ఆమెకు ఆంధ్ర సంగీతం నేర్పినాడు. వారిద్దరి స్నేహమూ ప్రేమగా మారింది. రాధాకృష్ణ సంగీత దర్శకత్వంలోకి ఉరికాడు. వివిధ వాద్య కుశలులైన వారిని చేర్చి, సంగీత మేళం ఏర్పాటు చేశాడు. ఎందులోనన్నా చొచ్చుకుపోయే జాతి గనుక అతడు మేళ విధానములో ప్రథమశ్రేణిలోకి వెళ్ళినాడు. వెంటవెంటనే ఒక సినిమా కంపెనీ అతన్ని సంగీత దర్శకుడుగా నియమించింది. వారు తీసే బొమ్మలో పాటలు దివ్యంగా, జనానురంజకంగా తయారై దేశమంతా మారుమ్రోగిపోయినవి. సుశీలాదేవి నాట్యమూ ప్రసిద్ధి వహించింది. రాధాకృష్ణ సుశీలలు రిజిష్టరు వివాహం చేసుకున్నారు. వారి వివాహానికి సినిమా ప్రపంచం, రసజ్ఞలోకం బంధుమిత్ర సమేతమై హాజరైంది. -

బుచ్చి వెంకట్రావుకు సుశీలకు స్నేహం లతలా అల్లుకుపోయి వారిద్దరూ విడవకుండా ఉండడమూ నరసింహమూర్తి మేష్టారుకు భయం వేసింది. వీళ్ళిద్దరూ ఎంతవరకు వెళ్ళినారో ఈ అతి స్నేహంలోంచి ఏ విషాద పరిణామం ఉద్భవిస్తుందో? రాధాకృష్ణ ఉద్దేశ్యమేమిటి? రాధాకృష్ణ మనస్తత్వం ఎలాంటిది? అతనికి ఇతర స్త్రీలతో సంబంధాలున్నాయా?

ఏమిటీ సినిమా ప్రపంచం! నీతి నియమాలకూ ఈ ప్రపంచానికి ఎక్కడా చుట్టరికమే లేదా? సినిమాలోకం సుడిగాలి లోకం. అతి అనేది తప్ప ఇంకోటి కనపడదు. ఆ వాతావరణంలో స్త్రీ పురుష సంబంధాలకు ఒక దారీ మార్గమూ లేదు. ఇక హద్దూపద్దూ లేదు. ఈ సినిమా వాతావరణం ఇతరమైన జీవిత పథాలకు కూడా ప్రసరించి దైనందిన నిత్య జీవితాన్ని కూడా కల్మషం చేస్తున్నది. నరసింహమూర్తి మేష్టారు గడగడ వణికిపోయాడు.

అడివి బాపిరాజు రచనలు - 7

138

జాజిమల్లి(సాంఘిక నవల)