పుట:Himabindu by Adivi Bapiraju.pdf/76

ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె మహాప్రళయము, భయంకర కాళికాదేవి, ఆమె శివత్రిశూలము, ఆమె చక్రధార!

సభ్యులందరు భీతులై వైవర్ణ్యమొందిన మోములతో దావానలము జూచు అరణ్యమృగములవలె వణకిరి. స్థౌలతిష్యులు వికృతానందముతో కలకలలాడు పెదవుల నొకశంఖ మొత్తుటయు, పలువురు సేవకులు విచ్చేసి యా శవమును తరలించిరి.

మలయనాగుడు ఆంధ్రదేశములో నివసించు కొన్ని నాగవంశములకు ప్రభువు. ఆంధ్రార్యులకంటె ముందుగనే ఆంధ్రదేశమునంతను నాగులాక్రమించుకొని యుండిరి. ఉన్నతశరీరులు, శ్యామలాంగులు నగు నాగులుత్తరభూములనుండి వచ్చి దక్షిణాపథమును రామాయణ కాలానంతరమందాక్రమించిరి. అంతకుముందే స్వల్పసంఖ్యాకులగు నాంధ్రర్యులు కృష్ణవేణి ముఖప్రాంతమున నివసించియుండిరి. పాండవకాలము నాడార్యులు విరివిగా వచ్చి నాగదేశము జొచ్చి నాగులతో సంబంధబాంధవ్యముల నెరపు చుండిరి. ఉలూపి కథయు, పురుకుత్సుని గాథయు నిట్టీవియే.

నాగులకు సామంతరాజ్యము లుండెను. అట్టివారిలో మలయనాగు డొకడు. నాగులందరు బౌద్ధమతావలంబకులే. కాని పట్టుదల కలిగిన బ్రాహ్మణులు కొందరు వీరికి ఆర్యదీక్షల నిచ్చి తమవైపునకు త్రిప్పుకొని వారిచే మిక్కుటమగు సహాయము నందుచుండిరి.

సభ్యులలో భయ మిసుమంతయు తగ్గలేదు. మహావనశాల గ్రామమున సభా కార్యక్రమము నిర్వర్తించిన వ్యక్తి లేచి భక్తియు, భయమును గదిరిన కన్నులతో స్థౌలతిష్యుని దిక్కు మొగంబై యిట్లనియె. మహా ఋషీ! మలయనాగుడు నాగులలో నుత్తమవంశ్యుడు. ఆతడు మాయమగుట ప్రజలకును, ఆంధ్ర రాజునకును తెలిసినచో మన జీవయాత్రలు ధాన్యకటకపాతాళగృహంబుల గడుపవలసినదే! ఇప్పుడు మనకు దారియేరి?”

స్థౌల: ఓ శివస్వాతీ! నీవు మాగధుడ వగుట తెలిసిపోయినది. మలయనాగుని దేహము ఓషధీరసంబుల చెక్కు చెడకుండును. ఏ భక్తునకు ఫాలనేత్రుడు, సర్వసృష్టి కారణుడు, మహాలింగమూర్తి సర్వవిషశక్తుల నిచ్చెనో యాతని కా పరంజ్యోతి వాని విరుగుడుల ప్రసాదింపడా? హాలాహల విషంబుల నవలీలగ ద్రావిన లోకేశ్వరుడు విషనివారణ మంత్రముల నాతని పాదముల భజించు భక్తులకు సమకూర్చడా? అప్పుడే మలయ నాగుని శరీరము ఓషధులచే తడుపబడెను. మహా విషపూరితయగు నా బాల నా ప్రాణములకు ప్రాణము, నా కోర్కెలకు నిధానము. చంద్రబాల యొక్క నిశ్వాసముల వడిని తగ్గింప ఒక వారము దినములు పట్టును. అంతవరకు నా తుచ్ఛుడటుల పడియుండవలసినదే.

ఆ వృద్ధుడు కన్నుల విస్ఫులింగములు రాలుచుండ, ఉచ్చైస్వనమున నిట్లనియె: “సభాసదులారా! మీరే యిట ధర్మవ్యవహర్తలు కండు. నా బాలను పరమేశ్వరున కంకిత మొనర్చితిమి. పవిత్రవేదమత పునరుద్ధరణ మహా కార్యమునకు నియోగించిన యీ శుభాంగియెడల పాతక మొనర్ప నెంచిన ఈ కర్మ చండాలుడు జీవింపవలసినదేనా? జీవమిచ్చినపక్షమున దైవాయుధమగు నీ బాలయందు మరల మరులుకొని మన ప్రయత్నములు భగ్నముచేయడా?”

మహేశ్వరానందుడు: స్వామీ! ఈతని మరణ మెట్లు కప్పిపుచ్చగలము?

అడివి బాపిరాజు రచనలు - 2

• 66 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)