పుట:Himabindu by Adivi Bapiraju.pdf/47

ఈ పుట ఆమోదించబడ్డది

మందరము ప్రార్థించుచున్నాము. వీరు మీవంటి ఉత్తమ బ్రాహ్మణులను బంధిపకయే తీసికొని పోదురు” అని మనవి చేసినాడు.

వృద్ధుడగు నా క్షత్రియుని అవలోకించి చంద్రస్వామి “చక్రవర్తిపై దోషమా! నేనా!” యనుకొనుచు “చక్రవర్తి శ్రీముఖసాతవాహనుడు ధర్మమూర్తియే! ఎందరు బ్రాహ్మణుల కగ్రహారముల నాయన సమర్పింపలేదు? ఈ అఖండ మహారాజ్యము సుభిక్షమై యా ధర్మరూపుని చల్లని పరిపాలనములో సర్వ సంపదల కాకరమై రామరాజ్యమును దలంపునకు తెచ్చుచున్నదే! వారి పైన నేను దోష మేమి యాచరింపగలను?” యని పలికినాడు. అతనిమోము వైవర్ణ్య మొందినది. విషాదమేఘము లాతని నావరించినవి.

ఆ దళవాయి చంద్రస్వామిని కనుగొని “స్వామీ! మీ రనునది నిజమే! కాని, ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చును. తమ్ముగూర్చి వృద్ధశ్వితవులు ఘనముగా చెప్పియున్నారు. మీకు సకల సౌఖ్యముల నొన గూర్చుచు తీసికొని పోదుము. చక్రవర్తి జన్మదినోత్సవము లఖండముగ జరుగుచున్నవి. ఆ ఉత్సవములు పూర్తికాకుండగనే ఈ అభియోగము విచారింపబడగలదు. ఇప్పుడు జాగుసేయక తాము తొందరగ బయలుదేరినచో, మనము తెల్లవారునప్పటికి ఏ మూడు క్రోశములైన పోగలము. తమకు అందలము సిద్ధము చేయించినాము. మేము అశ్వములపై ప్రయాణము చేయుదుము. ఒక వారములోననే మనము ధాన్యకటక నగరము చేరగలము” అని మనవిచేసి నమస్కరించెను.

13. ప్రయాణము

ఆంధ్రదేశమునం దెల్లెడను మహారాజపథములు, ఘంటాపథములు, రాజ మార్గములు, బాటలు విరివిగా నున్నవి.

మహారాజమార్గము ఎనిమిది దండములు వెడల్పు (దండము = 8 అడుగులు, అడుగునకు 9 అంగుళములు). ఘంటాపథము ఆరుదండముల వెడల్పు. ఈ బాటపై ఏనుగులు ప్రయాణము చేయును. రాజమార్గము నాలుగుదండముల వెడల్పు. వీనినే రథ్యలనికూడ పిలుచుచుండిరి. సాధారణపు బాటలకు అశ్వికపథమనియు, ఖరోష్టపథ మనియు, చక్రపథమనియు పేరులున్నవి. ఆశ్వికపథమునకు ప్రక్కనే మనుష్యపథమనియు, పాదపథ మనియు మనుష్యులు నడుచు పథమున్నది. ఈ పథము రెండు అరట్నులు వెడల్పు (1 అరట్ని = రెండు అడుగులు). ఈ బాటపై మనుష్యులు మాత్రమే నడువవలసి ఉన్నది. అన్ని పథములు రాళ్ళతో, సున్నముతో తరతరము లుండునట్లుగా నిర్మింపబడినవి. గ్రామము, గ్రామము కలుపు సాధారణపథములు గట్టిగా దిమ్మెస చేయబడి, ఎడ్లబండ్ల, అశ్వముల యానమునకు ఉపయోగపడు నట్టమరింపబడియుండెను.

ఈ మార్గములన్నిటికి పై అధికారి సర్వమార్గాక్షుడను ఉత్తమోద్యోగి. సర్వమార్గములు సరియైన స్థితిలో నుంచుటయు, మార్గముల ప్రక్క ఆరు గోరుతముల కొకచోట జలగృహముల నుత్తమస్థితిలో నుంచుట, మార్గములవెంట సత్రములు, సత్రములలో భోజనగృహములు, పశువైద్యశాలలు, మనుష్యవైద్య గృహములు నుచితరీతి జరుగునట్లు పర్యవేక్షణ చేయుట-ఇవి ఈ యధికారి ధర్మములు.

ఆంధ్రదేశము ధాన్యకటకమునుండి మహారాజపథములు నాలు గున్నవి. ఒకటి ధాన్యకటకమునుండి కృష్టదాటి వాయవ్యమూలగాబోయి, సువర్ణపురము, నాగేంద్ర

అడివి బాపిరాజు రచనలు - 2

• 37 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)