పుట:Himabindu by Adivi Bapiraju.pdf/261

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిషత్తుల కులపతుల, మహాభిక్షుకుల, భిక్షుల, భిక్షిణుల, జైనసన్యాసుల, దిగంబర శ్వేతాంబరుల, జైనమహర్షుల, వర్తక చక్రవర్తుల, యవనుల, సామంతుల ఆహ్వానించుటకు వివిధదేశములకు శ్రీముఖుని నిమంత్రణమున వెడలిరి.

పాటలీపుత్రము మహావైభవముగ అలంకరించుచుండిరి. ధర్మనంది ఆ అలంకారికులకు ఆజ్ఞ లిచ్చుచుండెను.

చక్రవర్తికి ఎటుచూచినను విజయమే. అయినను తన పెద్దకుమారుడు విషకన్యను ప్రేమించుచున్నాడనియు, నామె యాతని ప్రేమించుచున్నదనియు, కాని ఆ బాలిక విషకన్య యగుటయే వారి సమాగమమునకు అడ్డువచ్చిన దనియు చారులచే శ్రీముఖుడు వినినాడు. తన స్నేహితుడు, సోదరసమానుడు, ఆంధ్రరమాజనకుడు, ఉత్తమపురుషుడగు చారుగుప్తుని పుత్రికను వివాహమాడజాలనని యువరాజు తన తల్లితో చెప్పెనట. చక్రవర్తికీ సమస్య హృదయాందోళనకారణమయ్యెను.

చారుగుప్తుని నిర్వేదము తానెట్లు భరింపగలడు? శ్రీకృష్ణుని తన ఆజ్ఞచే హిమబిందు కుమారిని వివాహ మగునట్లు చేయవచ్చును. అవసరమైన అట్లు చేయవలసియున్నది. కాని శ్రీకృష్ణుడు ఆ విషకన్యను తక్క ఇంకొక్కబాలిక నుద్వాహముకాడట. తాను రాజ్యమునైన వదలివేయునట.

ఎవరా విషబాలిక! ఆమెను తా నొకసారి చూడవలసియున్నది. ఆ బాలిక స్థౌలతిష్యుని శిష్యురాలట. మనుమరాలని కొంద రనిరి. ఎట్టి మనుమరాలో! ఆ దూర్వాసుడు తన మనుమరాలిని విషకన్యగా నెట్లు చేయగలిగినాడో! వెనుక చాణక్యు డట్టి విషకన్యల విరోధినాశనమునకే ప్రయోగించు వాడట. స్థాలతిష్యులవారికి మాయెడ నింతకోప మేమి?

తాను శ్రీకృష్ణునికి ఈ నిరంతరమృత్యుసన్నిహితత్వ మెట్లు సహింపగలడు? విషకన్యను యువరాజు కడనుండి తొలగించి మరల స్థౌలతిష్యుని అంతికమునకు పంపవలయునా? అయినచో, యువరాజునకు మిక్కుటముగ కోపము రావచ్చును. కాని యెరిగి యెరిగి ప్రేమాస్పదుడగు నా బాలుని చావున కనుమతించుట యెట్లు?

ఈ విషమసమస్యను విడదీయగలిగిన మహానుభావుడు అమృత పాదార్హతులే! వారి దర్శనముచేసినచో నుత్తమ మనుకొనుచు, చక్రవర్తి రథమునెక్కి పాటలీపుత్ర పురముననున్న మహాచైత్య సంఘారామమునకు వెడలిపోయెను.

అమృతపాదులకు చక్రవర్తి తన్ను దర్శింపవచ్చుచున్నారని తెలియగనే చతుశ్శాలలోనికి వచ్చి, అచ్చట రత్నకంబళులు పరిపించి ఉపధానములు వేయించెను.

ఇంతలో చక్రవర్తియు వచ్చెను. అమృతపాదులకు నమస్కృతులిడి, ఆశీర్వాదమంది, కంబళిపై చక్రవర్తి యధివసించుటయు, అమృత పాదులును ఎదుట కూర్చుండిరి.

“ప్రభూ! తాము వచ్చిన కారణము?”

“విషకన్యకా శ్రీకృష్ణుల సంబంధవిషయమై తమతో నాలోచింప వచ్చితిని.”

“ఆ విషకన్యకడకు నేను వెళ్ళితిని. యనురాగ మెరుగని నాకు అవ్యాజపుత్రికాప్రేమ ఆ కన్నెపై నుదయించినది.”

“విషకన్యగదా! ఆమె సామీప్యమే మృతియనినారు!”

“నేను విషపు విరుగుడుల తోడనే వెడలితిని. ఆ బాలిక సాత్విక మూర్తి. స్థౌలతిష్యుల వారిని నేనెప్పుడును దర్శనము చేయలేదు. ఆయన మహాత్మ్యము ఆంధ్రు లనేకులు

అడివి బాపిరాజు రచనలు - 2

• 251 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)