పుట:Himabindu by Adivi Bapiraju.pdf/206

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెప్పలన్నియు నదిలోనికి పోయినవి. సొరంగమునుండి వచ్చిన బాణములేమియు తగులకుండగనే వారా గుహముఖమునుండి ఈవలకు రాగలిగినారు.

సువర్ణశ్రీ ఇంతలో తెప్పరిల్లి లేచి, ముక్తావళీ దేవిని హిమబిందుతోపాటు ఉపచారములు చేయుచుండ తెప్పలన్నియు నావలిగట్టు చేరినవి. అచ్చట కొందరు గోండులతో మహాబలు డేమియో వారి భాషలలోపలుక, నొక ముదుసలి గోండుయోధుడు ముందునకు వచ్చి తన మొలనున్న సంచి కట్టు విప్పి, ఏదియో యెండిన యాకింత తీసి మహాబలున కిచ్చెను. మహాబలుడు సువర్ణశ్రీకుమారునికి ఆ ఆకు నిచ్చుచు ఇది వారి మువ్వురను నమలు డని చెప్పెను.

ఆ ఆకును హిమబిందును, సువర్ణశ్రీయు నమలి మ్రింగిరి. ముక్తా వళీదేవి నెమ్మదిగ కన్నులు తెరచి, తలయూపి కన్నులు మూసికొనెను.

“అమ్మమ్మా, ఈ ఆకు ఇంత నమలి మ్రింగుము. అమృతమువలె మాకు పనిచేసినది. నోరుతెరచి కొంచెము నములుము” అని హిమబిందు ముత్తవనోరు తెరిపించి యామెచే చిటికెడు ఆకు నమలించెను. వెంటనే ముక్తావళీదేవి కన్ను తెరచినది. హిమబిందు మరల కొంతఆకు నమలించినది. ఆమె లేచి కూర్చుండెను.

సువర్ణశ్రీ సహాయమున హిమబిందును, ముక్తావళీదేవియు తెప్పల నుండి క్రిందికి దిగిరి.

అచ్చట గోండువీరు లనేకులు బారులు బారులుగ వేనకువేలు కూర్చుండియుండిరి. ఎవరో మంటలు చేసిరి మెత్తనితోళ్ళ నక్కడ పరచిరి. అందుపై ముక్తావళీ దేవిని పండుకొన బెట్టిరి.

మహాబలగోండుడు: సువర్ణశ్రీ! నీ వేమైతివోయని ఒక్కనిమేషము నేను భయపడినాను సుమా! ఏలనన, నిన్ను నేను వదలిన ప్రదేశము నుండి నీవు నీటికడకు ప్రాకి వెళ్ళినది గమనించితిని. అటుపైన మరల వెనుకకు నీ గుర్తులు కనుపించినవి. అటనుండి నీటి ఎగువవైపు నీవు పోయితివి. అచ్చట ఒకచోట నీవు నీటిలోనికి జారిపోవుట చూచితిని. అది ఏమరుపాటున జారిపోవుటకాదు. జారిపోవలెనని నీవు జారితివని గమనించుటకు నాకు కొంతకాలము పట్టినది.

సువర్ణ: అవును. నేను చల్లగ చప్పుడుకాకుండ నీటిలోనికి దిగవలెనని ప్రయత్నించుచుండ, చటుక్కున జారి నీటిలో పడితిని. కాని దెబ్బమాత్రమేమియు తగులలేదు.

మహా: యీలోననే ఆ అడవియంతయు గోండులు, రాక్షన మిత్రులు వెదకి అక్కడక్కడ కావలికాయు పుళిందులను, శబరులను పట్టుకొన్నారు.

సువర్ణ: మీ వారందరు ఎప్పుడు వచ్చినారు?

మహా: నేను మా దేశాభిముఖుడనై వెళ్ళినసంగతి ఎరుగుదువు. రాక్షసుల నీ ప్రదేశమంతయు వెదుక నాజ్ఞనిడితిని. ఇంతలో మన ప్రయాణములో పంపినవార్త అంది, మా గోండులు వచ్చి నన్ను కలుసుకొనిరి.

సువర్ణ: యీ అటవీ సంచరణవిద్య చాల అద్భుతమైనది.

హిమబిందు సువర్ణశ్రీ దెస కృతజ్ఞతయు, ప్రేమయు నుట్టిపడ గాంచుచు, స్మితవదనయై, “మేమున్నస్థల మెట్లు కనిపెట్టినారు? ఇతరు లందు చొరనేరరని వారందరు గర్వపుమాటలు పలికిరే!”

సువర్ణ: అయస్కాంత మెక్కడున్నదో, లోహశకలమునకు తెలియదా!

అడివి బాపిరాజు రచనలు - 2

• 196 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)