పుట:Himabindu by Adivi Bapiraju.pdf/181

ఈ పుట ఆమోదించబడ్డది

 శ్రీకృష్ణసాతవాహనుడు దీపమును జూచు శలభమువలె నట్లేకదల లేక ఆ పాము ఎట్లాడిన నటువైపునకు తల త్రిప్పుచున్నాడు.

అంతకన్న అంతకన్న ఆ పామునకు కోప మెక్కువైనది. ఆవేశముచే పాము ఇటునటు ఊగిపోవుచుండెను.

ఒక్కసారిగా ఆ భయంకర కాలవిషధరము మహావాయువైనట్లు, సర్పాస్త్రమైనట్లు, ఇటునటు పరువులెత్తి, ఇంకను మంచముదాపునకు వచ్చి ఒక్కపెట్టున తోకపై లేచి మంచముపై కురికినది.

అంతపెద్ద పర్యంకముపై ఏ పామురకగలదు అన్న ధైర్యముతో నున్న కతమున నా పన్నగ ఉరుకునకు శ్రీకృష్ణుడొక పెద్ద హాహాకారము సలిపి వెనుకకు పడిపోయెను.

ఆ వెంటనే తెల్లని మొగలిరేకువంటి, గంగోత్తరకడ భాగీరథీ ప్రవాహమువంటి, మహర్షి దీవనవంటి, దేవతల పాణితలముల జగన్మోహినిపోయు అమృతపుధారవంటి శ్వేతోరగి ఒకర్తు మంచముపై కురికినది. శ్రీకృష్ణసాత వాహనునిపాదమున కాటువేయబోవు ఆ కాలసర్పము వెంటనే ఆగి పడగెత్తి ఆడుచు కదలక బొమ్మవలె నైపోయినది.

ఆ పాము నెదుర్కొనిన యాధవళపన్నగి కోపమెరుగని నిశిత సత్యమువలె మిలమిలలాడుచు పడగెత్తి యాకాలనాగము నెదుర్కొని కదలక, మెదలక ఒక్కసారి మాత్రము రామబాణమువలె, మహేశ్వర వీణానాదమువలె “గస్” అనిమాత్ర మనినది.

భయపడి, సిగ్గుపడి, ఓటమిని సూచించుచు తల ముడుచుకొని యా కాలనాగము మంచమునుండి క్రిందికి జారిపోయి ఎటుల మాయమైనదో మరల శ్రీకృష్ణున కది గోచరముకాలేదు.

శ్వేతపన్నగిమాత్రము ఒకసారి శ్రీకృష్ణసాతవాహనునివైపు తల త్రిప్పిచూచి యదియు మంచమునుండి యురికి మాయమైనది.

భయము ఒక ముహూర్తకాలమువరకు శ్రీకృష్ణసాతవాహనుని వదలలేదు. కొంతవడి కాభయముతీరి, వీరుడగు నా మహారాజు ఒక్కుమ్మడిలేచి మంచమునుండి యురికి, దాపున ఉన్నతపీఠముపై నుంచిన బంగారుగంట గణగణ వాయించెను. చెంతనున్న ఒరనున్న కరవాలము చర్రునలాగి, గుమ్మముకడకు బోవునప్పటికి బిరబిర తలుపులు తెరచి రక్షకస్త్రీలు లోనికి ప్రవేశించిరి. వారందరి హస్తముల కత్తులు తళతళలాడు చుండెను.

క్రోధపూరితనయనుడై కరవాలము ధరించి ద్వారముకడ తమకెదు రైన ప్రభువునుజూచి వారు సంభ్రమము నందిరి. ఇంతలో సేవకు రాండ్రు ద్వారపాలకులు, కంచుకులు శయనమందిరముకడకు వచ్చిరి.

శ్రీకృష్ణసాతవాహనునికి మెరుపువలె ధాన్యకటకమున జరిగిన శ్వేత పన్నగ దర్శన సంఘటన జ్ఞప్తికి వచ్చినది.

నిమిషమున మనస్సు త్రిప్పుకొని, యాతడు చిరునవ్వు నవ్వుచు,

“ఓయీ! అంతఃపురపాలకునికి వెంటనే ప్రయాణసన్నాహము చేయ మా ఆజ్ఞగా తెలుపుడు. స్నానార్థము మేము పోవుచున్నాము. శుభముహూర్తము కెంత కాల మున్నది?”

“ప్రభూ! ఇంకను మూడు గడియలు వ్యవధి యున్నది” యని కంచుకి మనవి యెనర్చెను.

అడివి బాపిరాజు రచనలు - 2

* 171 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)