పుట:Himabindu by Adivi Bapiraju.pdf/166

ఈ పుట ఆమోదించబడ్డది

 చంద్రస్వామి ప్రాణమునకు భయపడలేదు, కారాగారవాసమునకు భయపడలేదు. అమృతపాదులను చూడగనె చంద్రస్వామికి స్థౌలతిష్యులను జూచిన గురుభక్తి కలిగినది.

అమృతపాదులు ధాన్యకటక మహాచైత్య సంఘారామమునకు చంద్రస్వామిని గొనిపోయిరి.

ఎవరీ మహాపురుషుఁడు! మూర్తినందిన శాంతతేజస్సున ఈ బౌద్ధాచార్యులు అపరబుద్ధ దేవునివలె నున్నారు. ఈ పుణ్యపురుషుని చూచిన తన గురుపాదులగు మహర్షిని చూచినట్లున్న దేమి! వీరికిని వారికి పోలికలున్నవి. ఎత్తు, మోముతీరు, కనులు, కంఠస్వరము, రూపము ఇంత పోలికలున్న మేమి! మహాపురుషులు ఆర్షధర్ములైననేమి, బౌద్ధధర్ములైన నేమి - ఒకే రూపమున నుందురు గాబోలునని చంద్రస్వామి తలపోసెను.

కులభేదములేని బౌద్ధాశ్రమమున చంద్రస్వామి భిక్కులతో కలిసి భోజన మాచరింపక తనవంట తాను చేసికొనుచుండెను. చంద్రస్వామికిని అమృత పాదార్హతులకును దీర్ఘమగు వాదోపవాదములు జరుగుచుండెను. చంద్రస్వామి బోధిసత్వునిజీవిత మొక్కపరి సంపూర్ణముగ పరిశీలించి చూచెను. శాక్యవంశోద్భవుడై, కపిలవస్తునగరమున రాజగు శుద్ధోదనునకు మాయాదేవివలన జన్మించిన దివ్యపురుషుడు. మాయాదేవి సుప్రబుద్ధుని తనయ. సిద్ధార్థుడు జన్మించిన ఏడవదినమున మాయాదేవి నిర్యాణ మందినది. ఆ బోధిసత్వుని అత్యంత జాగరూకతగ మేనయత్త ప్రజాపతి గౌతమి పెంచినది. అతని పదునారవఏట తనయీడుది, జగదేకసుందరి కొలిరాజ్యాధిపునితనయ యశోధరను బోధిసత్వునికి వివాహము సలిపిరి. బోధిసత్వుని ఇరువదవఏట రాహులుడను పుత్రుడాయన కుద్భవించెను.

ఇరువది ఐదవఏడువచ్చు నంతవరకు సిద్ధార్థుడు భార్యతో, తనయునితో సర్వసౌఖ్యముల నందుచుండెను. కాని విధివశమున ఆ మహాపురుషుడు ప్రపంచబాధలును, దుఃఖమును తన కండ్లారచూచి అనంతవిచారము నందెను.

ఆయన హృదయమున దివ్యసందేశము వినవచ్చినది. సూతుడగుచెన్నుని సహాయమున ఆ దివ్యమూర్తి అభినిష్క్రమణ మొనర్చి, వైశాలిచేరి, పండితుల నాశ్రయించి సృష్టి రహస్యముల నెరుగజొచ్చెను. ఆచటి కాలామ పండితులు కపిలమహర్షి ప్రతిపాదించిన సాంఖ్యవాదమును బోధించిరి.

ఆయన పాదములకడ సంఖ్యము చదివి బోధిసత్వుడు ఉద్రకరామపుత్రమహా పండితుల శిష్యుడయ్యెను. రామపుత్ర పండితులు కాణాద వైశేషికము బోధించిరి.

అచ్చట వైశేషికమంతయు నభ్యసించినవెనుక బోధిసత్వుడు గయకడ ఉరు బిల్వాశ్రమము చేరి, ఆ ఆశ్రమకులపతి యగు కౌండిన్యమహర్షి శిష్యుడై యోగము నేర్చుకొన నారంభించెను.

ఆయన యోగసమాధులలో ఉండునప్పుడు నైరంజన నదిలో స్నానము చేయుచు అధిక నీరసముచే మూర్ఛపోవునంత పని అయి ఒడ్డుకు వచ్చి సొమ్మసిలి పడిపోయెను. అప్పుడే సుజాత బోధిసత్వుని రక్షించెను. అప్పుడు బోధిసత్వు డాయోగవిధానము విసర్జించెను.

ఆ ఆశ్రమప్రాంతమందొక రావిచెట్టున్నది. ఒక దివ్యాతిదివ్య ముహూర్తమున ఆ రావిచెట్టు క్రింద పద్మాసనబద్ధుడై బోధిసత్వుడు పరమ సత్యముల కనుంగొనెను.

చంద్రస్వామి ఇట్లు బుద్ధచరిత్రయంతయు తెలిసికొనెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 156 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)