పుట:Himabindu by Adivi Bapiraju.pdf/137

ఈ పుట ఆమోదించబడ్డది

జన్మపరంపరాంగతమైన మన యీ బంధము సనాతనము, నిత్యము. మనకింక వియోగమెట్లు? అత్మాంబుజ తరణివి, సౌందర్యాధిదేవతవు, శిల్పరాజ్య రమవు, నా దేహ మనఃప్రాణములకు ఏడుగడవు నాకు నీవు ఒక్కతెవు -”

ఇంతలో బాలనాగి వారిని దరిజేరి “అయ్యవారూ, అమ్మాయి గారితో చారుగుప్తులవారు నిన్ను శ్రీకృష్ణశాతవాహనమహారాజునకు మహారాణిగా నొనర్ప దలచినా”నని జైత్రయాత్రకు వెడలిపోవుముందు చెప్పి ప్రయాణమైపోయినారు. మీరు చిన్నలయ్యు గుణముల పెద్దవారు. ఈ యమ్మ తండ్రిచాటు బిడ్డ. మీరు తొందరపడక ధైర్యముగా నుండుడు. రేపే మగునో మనకు తెలియదు. ఈ కష్టము లిట్లే యుండవు. మీరిరువురు సమ్మాళించుకొనవలెగాని సాహసము తలపెట్టకుడు” అనుచుండ హిమబిందు తటాలున దానిచేతిలోని పూలసజ్జగైకొని “బాలనాగీ! ఇంచుక నిలువవే. నా మనోనాథుని కడసారి పూజింతును. ఈ జన్మమునకు నాకిదియే చరితార్థత” అనుచు నా పూవులతో సువర్ణశ్రీపాదములు పూజించెను. అందు రెండుపూలు కనుల కద్దుకొని కీల్గంటున దురిమికొనెను.

సువర్ణశ్రీఅట్లే మ్రాన్పడి నిలిచియుండెను. హిమబిందు చూపులతో ననుజ్ఞ వేడి, బాలనాగీసహితయై గృహాభిముఖియై అల్లనల్లన నేగెను.

ఆతని కొడలు తెలియునప్పటికి ప్రొద్దుపడమర తిరిగినది. శూన్య విలోకనముల నా వనమెల్ల నెవరికొరకో వెదకుచు నాతడు అచ్చోటు కదలి యేగెను.

20. ఆనందులువారు

హిమబిందు ఎట్టు చేరినదో తన మందిరము. బాలనాగి ఆమెను ఎత్తుకొని నడచినది. చెలులంద రా విషయము తెలిసి పరుగిడివచ్చినారు. ఆమెను పూవుల ప్రోవునుబలే ఎత్తుకొని శయనమందిరము జేర్చి తల్పమున పరుండబెట్టిరి. వికారము లేమియు లేకపోయినను ఆ బాలిక చైతన్యరహితయై పడియున్నది.

వార్త అందినవెంటనే ఆనందులవారు తేరెక్కి పదినిమేషములలో వాలినారు. ఈలోన బాలనాగియు, ముక్తావళీదేవియు పన్నీరముతో హిమబిందు నుదుటిని తడుపుచు ఉపచారముల జేయుచునే యుండిరి.

ఇటుల జరుగునని ఆనందులవారికి దెలియును. ఆ బాలిక జీవితములో ప్రణయాధ్యాయము ప్రారంభించినదని ఆమెనాడిని పరీక్షించిన మొదటి నిమేషముననే ఆయన గ్రహించినాడు. ఆమెను మహారాజ్ఞిని జేయ నిశ్చయించితినని చారుగుప్తుడాయనకు జెప్పెను. శ్రీకృష్ణశాతవాహనుడు ఈ వణిక్సార్వభౌముని జామాత యగును. ఆ బాలకుడు సుందరమూర్తి, ధీరోదాత్తుడు. అట్టియువకుని ఈ బాల ఏల ప్రేమించలేదు! ఆడువారిచిత్త వృత్తులన్నియు గూఢతిగూఢములు, చిత్రాతిచిత్రములు.

ఆయన వచ్చియు రాగానే మంజూషనుండి స్ఫాటిక కరండుకతీసి, చిటికెడు నస్యము నామెనాసికారంధ్రములకడ నుంచెను. ఆ గాలి లోనికి బోయి వెంటనే పెద్దపెట్టున తుమ్ముచు హిమబిందు లేచి కూర్చుండినది.

“ఏ మిది బాబయ్యగారూ?”

“ఏమియు లేదు తల్లీ! బాలనాగీ! అత్తగారు! మీరంద రావలికి పొండు.”


అడివి బాపిరాజు రచనలు - 2

• 127 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)