పుట:Himabindu by Adivi Bapiraju.pdf/128

ఈ పుట ఆమోదించబడ్డది

“అమ్మా, ఏ మట్లు పండుకొంటివి? దేహమున సుఖముగ నున్నదిగదా!”

హిమబిందు ఉలికిపడినది. తండ్రిని చూచి మనోరధ ప్రవాహమును, మంచమును విడిచి లేచి ఆయన పాదములకు నమస్కరించి తలవంచి నిలుచున్నది. ఏదియో అద్భుతకాంతి, ఏదియో అమృతానందము ఆ బాలఫాలమున, నాసికను, లోచనముల, పెదవుల తాండవమాడుట చూచి, ఏదియో అపరిమితానందము సమకూర్చు సన్నివేశము జరిగియుండవలె నీ బాలికకు - అనుకొని యామెను హృదయమునకు జేరదీసికొని మనస్సున నాశీర్వదించి,

“అమ్మా, నీ వా మంచముపై కూర్చుండుము. నే నీ యాసనమున కూర్చుందును.”

“నాయనగారూ, ఎప్పుడు మీ ప్రయాణము?”

“ఆ విషయాలన్నియు మాటలాడుటకు వచ్చినాను కన్నతల్లీ!”

“నాయనగారూ! సమదర్శిబావ ఉజ్జయినిలో క్షేమముగ నున్నాడా?”

చారుగుప్తుడు తనయ మాటలకు లోన కొంతభయమంది, యామెముఖము నిపుణముగ పరిశీలించెను. తన బాలిక సమదర్శిని ప్రేమించు చున్నదా? సమదర్శి మేనల్లు డగుగాక! అయిన నేమి? తనతనయ ఆంధ్ర సింహాసనయోగ్య.

“క్షేమముగ నున్నాడు. అక్కడ ఇంతవరకు సేనాపతులెవ్వరికి ఆపత్తులు జరుగలేదు. తల్లీ! ఆంధ్రసామ్రాజ్యము తూర్పుతీరమునుండి పశ్చిమసముద్ర తీరానికి రెండువందల యోజనముల వెడల్పున్నది. ఉత్తర దక్షిణములకు ఇప్పు డంత యున్నది. ఇంక రెండు వందల యోజనములు వృద్ధినొందితీరును. దానికి నీ బాబయ్యయే కారణమగుచున్నాడు.

హిమబిందు ఆశ్చర్యపూరితహృదయమున తండ్రిమాటలు వినుచుండెను.

“తల్లీ! ఈ విశాలసామ్రాజ్యమునకు నీవు సామ్రాజ్ఞివి కాబోవుచున్నావు. చారుగుప్తుని తనయ జంబూద్వీపసామ్రాజ్యసింహాసన మధిష్టించి మహారాణులు వింజామరలు వీవ, మహామాండలిక రాణులు పాదములు కడుగ, మాండలిక పత్నులు పదము లద్ద మహాసామ్రాజ్యాభిషేకము నందబోవుచున్నది.

హిమబిందున కేదియో భయము మబ్బువలె ఆక్రమించినది. తండ్రి మాట అర్థము చేసికొనలేకపోయినది. మాట లుడిగి నిశ్చేష్టయై తండ్రి మాటలు వినుచున్నది.

“యువరాజు శ్రీకృష్ణశాతవాహనుడు ఎంత అందమైన బాలుడు! ఎంత విక్రమోపేతుడు! తండ్రినిమించిన వీరుడు, సకలభారతావనిలో అతని మించిన సుందరు డింకొకడు లేడు. అతని కతడే సాటి. అట్టి కొడుకును కోరికోరి నేనును మీ అమ్మయు తపము లాచరించినాము. నోములు నోచినాము. దివ్య చైత్యముల కెన్నిటికో మొక్కు కొన్నాము. నా దురదృష్టముచే మీ అమ్మయే....”

హిమబిందుకన్నుల నీరు తిరిగినది. కొమరిత కంటినీరు చూచి, చారుగుప్తుని కన్నులలో నీరు తిరిగినది. హిమబిందు వెంటనే తండ్రికడకు గబగబవచ్చి, యాతని హృదయమున వాలి వెక్కివెక్కి ఏడ్చెను.

చారుగుప్తుడు తాను వచ్చినపని భంగమగునని సమ్మాళించుకొని, తనయ నుపశమిల్లజేసి చెంతనిడుకొని, నెమ్మోము పుడుకుచు నిట్లువచించెను.

“తల్లీ! మీ అమ్మతో నిన్ను నా ప్రాణములకన్న ఎక్కుడుగ సంరక్షింతునని వాగ్దానము చేసియున్నాను. లోకములో నుత్తమునకు ని న్నిత్తునని మ్రొక్కుకొన్నాను. నే డా కాలము

అడివి బాపిరాజు రచనలు - 2

• 118 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)