హిమబిందు ఆతని చూడ్కులు గాంచి “అదియేమి, శ్రీ! అట్లువింతగా జూచెదవు?”
“కాదు, దేవీ! నీవు నీవేనా యని చూచుచున్నాను. నాపూజా పీఠముపై మలచికొన్నది నిన్నా, లేక నీలోనున్నది నాయారాధ్యదేవతయా అని చూచుచున్నాను.”
“మీకు నే నిన్నివిధముల కనిపిస్తున్నానేమోగాని, నేను మాత్ర మొక్కతెనే. మీరును నా కొక్కరే.”
“నిజమా నీ మాట బిందూ! నే నంతటా నిన్నే చూచుచున్నాను. నీ వొక్కతవే ఇన్నిచోట్ల ఇన్ని కాలముల నెట్లుంటివి?”
“అవును. మీ రున్న చోటెల్ల నే నున్నాను.”
“నేను లేనిచోటనో?”
“మీరు లేనిచోటు లేదు.”
మరల వారొకసారి కిలకిల నవ్వుకొనిరి. పరస్పరము చూచుకొనిరి. గున్నమామిపై నున్న కోకిల మొకపరి కుహూ యున్నది. వారిరువురును నులికిపడిరి. కృష్ణవేణి వెలినురువు నగవు లొలుకబోసికొనుచున్నది, సువర్ణశ్రీ యా బాలికకరము గ్రహించి, “బిందూ! నా భాగ్య మేమని చెప్పను! ప్రేమసర్వస్వమగు నీమృదుబాహువల్లరి నాకు నేటికి చిక్కినది. ఇవి యూతగా నేడు ఈ దేశములను, కాలమును గడచిపోగలను” అనుచు బ్రియమార నా చివురుకెంగేలు ముద్దుగొనెను.
యవనవంశ పరంపరాగతమైన ఆమె ఉడుకురక్తము పొంగి పరవళ్ళెత్తినది. వారిరువురు లేవబోయినప్పుడు ఆమె వివశయైతూలి ఆతని హృదయమున వ్రాలినది. సువర్ణశ్రీహృదయమున వాంఛయు నొక్క ఉరుకున పైకి విజృంభించినది. అప్రయత్నముగ ఆతని బాహువు లా బాలికను చుట్టివేసినవి. ఆత డామెను గాఢముగా తన హృదయమున కదిమి కొనినాడు. దేశకాలములు ఊపిరిబిగబట్టి నిలిపోయినవి.
బాలనాగి దవ్వులనుండి “అమ్మా! ప్రొద్దుపోయినది” అనెను. వారిరువురు ప్రకృతిస్థులైరి.
ఆమెయందు శాంతమై ప్రవహించు ఆర్యత్వము గాఢవ్రీడాభావ ముదయింప చేసినది.
“రే పీ వేళకు... ఇక్కడ...” అనుచు ఆమె పరువిడిపోయినది.
13. ప్రేమ కలశాంభోధి
ఆ ప్రేమికులిరువురు మరునా డా సంకేతస్థలముననే కలసి కొన్నారు. బాలనాగి ద్వారముకడ రక్షకభటురాలైనది.
హిమబిందు మాటలాడలేక త్రపాహృదయియై తలవాల్చి “ఆర్యా! నేనును మీరు నిట్లు కలిసికొనుట తగదు. నేటితో సరి మన ఏకాంతము” అని పలకినది.
సువర్ణశ్రీ కుమారుడు: ఏమి యీ మాటలు? తన్వంగీ! మన మిక్కడ గాకున్న ఎక్కడనైన కలసికొనవలసినదే. రమణీయమగు విశ్వమంతయు మనకు సంకేతస్థలమే. మన మిక కలసికొనకుండు టెట్లు?
హిమబిందు హృదయమున కేమియు తోచుటలేదు. సువర్ణశ్రీకుమారుని తాను ప్రేమించినమాట నిజము. నిజము! ఆమెది రాజసప్రకృతి. ఏ రసావేశమైన నా బాలలో
అడివి బాపిరాజు రచనలు - 2
• 110 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)