రామ : అంచేతనే నేనూ సిగ్గుతో చచ్చిపోతున్నాను, తెగించి దేశాలంట పోదూనా అనిపిస్తూంది.
గిరీశం : నాతో యెన్నడు చెప్పకపోతివే?
రామ : యేమని చెప్పను. సిగ్గుచేత చెప్పలేదు.
గిరీశం : ఒకరి లోపాలికి మనం సిగ్గుపడనేల? చేతనయినంతవరకూ మళ్లిద్దాం. మళ్లకపోతే కనికరిద్దాం. సిగ్గుతోనూ, కోపంతోనూ పనిలేదు.
రామ : నామీద్దయ చేత మీరు అలా అంటారు. లోకంలో తలయెత్తుకు యెలా తిరగను.
(తెర దింపవలెను.)
ప్రథమాంకము
తృతీయ రంగము
(అక్కాబత్తుడి యింటి వీధి అరుగు)
(వెంకన్న, అక్కాబత్తుడు ప్రవేశించును)
వెంక : యేనుగులు దొబ్బేశాయండోయి.
అక్కా : యెవరియేనుగులు? విజయనగరం వారివా? బొబ్బిలివారివా?
వెంక : కాదండి, దిగ్గజాలు.
అక్కా : యెక్కడికి వెళ్ళిపోయినాయి?
వెంక : భూమి వెలగపండులా గుండ్రంగా వుందిష. అంచేత యేనుగులు మోత అక్కరలేదుష
అక్కా : భూమి వెలగపండయితే యేనుగులు వెలగ పండు తినేస్తాయి కాబోలు!
వెంక : మా రాముడు చెప్పాడు.
అక్కా : ఇంకా ఏమి చెప్పాడు?
వెంక : వేదాలేవళ్లో రాశారుష, రాములువారు మనీషష, దేముడు కాడుష.
అక్కా : మీకు కొండిబొట్లు ఇంగ్లీషు చదువు చెప్పించాడు కాడని నాకు కించగా వుండేది. ఇంగ్లీషు చదువు కిదే ఫలితమయితే మరి విచారం లేదు. తురకలు మెడకి కత్తి మొనజేర్చి గొడ్డు మాంసం తినిపించే వారు. ఈ యింగ్లీషు వాళ్లు చదువులు పెట్టి మనవేళ్ళతో మనకళ్లే పొడుస్తున్నారు. అదిగో మీ బాబు వస్తున్నాడు పారిపో.
(యిద్దరు నిష్క్రమింతురు. )
గురుజాడలు
468
కొండుభొట్టీయము