పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/8

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమగాథ

పీటలమీద పెండ్లి

1

పెళ్ళివారంతా యధోచితస్థానాల మహాఠీవిగా కూర్చున్నారు. శ్రీ కుమారసింహ గుణార్ణవకుమార అరిభీకరసూర్య గోన వరదారెడ్డి సాహిణి కుమారుడు వరుడై, సమస్తాభరణాలు ధరించినవాడై, జరీపూవులూ ముత్యాలకూర్పులూ కుట్టినహొంబట్టు ఉపధానాలమధ్య చెక్కిన పాలరాతివిగ్రహంలా వివాహ వేదికపై కూర్చుండిఉన్నాడు. వజ్రాలుకూర్చిన బంగారు పిడితో నడుమునవ్రేలాడు డాలుపై ఎడమచేయి తీర్చియున్నది. కుడిచేయి దిండుపై అలంకరించియున్నది.

వర్ధమానపురరాజ్యపు మంత్రిముఖ్యులూ, సేనానాయకులూ, రాజబంధువులూ, సామంతప్రభువులూ మొదలైనవారంతా చుట్టూ పరివేష్టించియున్నారు.

ఆదవోని రాజ్యం పరిపాలకుడు ప్రతాపాదిత్య, ప్రచండవిక్రమ, పరగండ భైరవ, అశ్వసాహిణి శ్రీ కోటారెడ్డిదేవర మహామండలేశ్వరుడు శ్రీ విశాలాక్షీ దేవీపూజానిరతురాలగు తనకుమార్తె అన్నమాదేవిని వర్ధమానమండలేశ్వరుల కుమారునికి వివాహముచేస్తూ ఉన్నారు. ఈ రెండు రాజ్యాలనూ ఏకంచేసే ఈ శుభలగ్నానికి అప్పుడే త్రైలింగ మహాసామ్రాజ్యానికి సార్వభౌములైన శ్రీ శ్రీ రుద్రమదేవచక్రవర్తియు మహామంత్రులైన శ్రీ శివదేవయ్య దేశికులును, సర్వసైన్యాధ్యక్షులైన శ్రీ జన్నిగదేవ మహారాజులుంగారును బహుమతులు, ఆశీర్వాదాలు సేనాధికారులద్వారా పంపించియున్నారు.

ఆదవోని దుర్గంలో పెద్దరాచనగరిలోనున్న నూరు స్తంభాల వివాహ మంటపమంతా ఆంధ్రరెడ్ల వైభవం వేనోళ్ళచాటుచున్నది. గోడలపైన రసవంతాలైన చిత్రాలు, దంతశిల్పం, పొదిగిన కళలూరే స్తంభాలు, చిత్రచిత్ర లతలు నగిషీ చేసిన వెండిప్రమిదల్లో కమ్మని చందనం, సంపెంగ, మల్లె, జాజి నూనెల్లో వెలుగుతూఉన్న పైడిప్రత్తివత్తుల దీపాలు, ఆ మధ్య వివాహవేదిక, బంగారు స్తంభాలతో, ముత్యాల అల్లికలతో, రంగురంగుల మణులు పొదిగిన అనల్పకల్పనలతో, పచ్చని మామిడాకు తోరణాలతో, నారికేళాలూ, అరటి గెలలతో, పట్టుగొడుగులతో, ముత్యాలతోరణాలతో ఆ మండపం వెలిగి పోతున్నది. వివాహవేదికలో యెడమభాగాన పచ్చని పట్టుతెర సౌభాగ్యవతి యగు వధువు రాకకు నిరీక్షిస్తున్నది.

రంగుగంగు పట్టు తలచీరలవారూ, బంగారు కిరీటాలవారూ, నిమ్మపండ్లు నిలిచే భయంకరమైన మీసాలవారూ, రత్నహారాలూ, భుజబంధాలూ, కంక