విజయధ్యానం
293
అప్పుడే అనుమానము తన హృదయములో కలిగినది.
పిమ్మట అతడు తనతో కృష్ణకు స్నానమునకు రాడు, ఎప్పుడు తన్ను చూడటానికి వచ్చినా సంపూర్ణకవచధారియై ఉండడము తన అనుమానానికి దోహదమిచ్చెను.
మరల తన్ను కలుసుకొన్నప్పుడు ఆ బాలునికి, ఆ జగదేకసుందరికి తలపై నొకరు ముసలప్రయోగము చేయడం సంభవించింది. ఆ బాలిక తూలి నిశ్చేష్టయై గుఱ్ఱముమీద కూలి గుఱ్ఱము కంఠము గట్టిగా పట్టుకొన్నది. వెంటనే తాను, ఆ శత్రువును రెండు తుండెములుచేసి, విశాలాక్షప్రభువును ఎత్తుకొని అక్కినమంత్రికి యుద్ధము నడప ఆజ్ఞయిచ్చి, తన గుఱ్ఱంమీద రెండు గవ్యూతుల దూరములోవున్న గ్రామములో శిబిరానికి తీసుకొనిపోయినాడుకదా!
మల్లికార్జునరెడ్డి తన వెనుకనే గుఱ్ఱముపై వచ్చినాడు.
తాను ఆ బాలకుని శిరస్త్రాణము విప్పగా జానువులవరకు వ్రేలాడే ఆమె తలకట్టు ముడివైచి దృశ్యమయినది. తల పై భాగం కొంచెం నలిగి రక్తము నిండి పోయినది. నీటితో ఆ రక్తము కడిగి, ఔషధములు పులిమి తలకు కట్టుకట్టి తాను.....
‘ఈ బాలిక అన్నాంబికాదేవి, నువ్వు మల్లికవుకాదా?’ అని మల్లికార్జున రెడ్డిని అడిగినాడు. ఆమె ఒప్పుకొని, ‘ప్రభూ! ఈమె అన్నాంబిక అని తెలిసినట్లు మీరు వ్యవహరించకండి. ఈమె సిగ్గుచే ఏపనినయినా చేయగలదు. మహారాజా! ఈ తల్లి మీపైన బద్దానురాగ! మీ రామెకు భగవంతులు! ఈ జన్మలో ఆమె మిమ్ముమాత్రమే వివాహం కాగలదట. లేనట్లయితే తనప్రాణమే భైరవునికి అర్పించుకుంటానని ప్రతిజ్ఞ పట్టింది’ అనిచెప్పెను.
4
దేవగిరికోటకు ఎల్లోరాగుహకు మధ్య ఎత్తయిన కొండలు, కొండలపై జనపదాలు ఉన్నవి.
దేవగిరికోటకు ప్రతిష్ఠానానికి మధ్య కొన్ని చిన్న గిరులు ఉన్నాయి. యాదవ మహాదేవరాజు సైన్యాలతో ప్రతిష్ఠానం చేరకముందే మల్యాలవారిలో పదియేనువేల అశ్వికసైన్యం ముందు ప్రతిష్ఠానానికి ఎగువనే గోదావరినదిని దాటింది.
గోన గన్నారెడ్డి దేవగిరి దారిలో రెండు కొండలమధ్య సేనలను నిలిపినాడు. మల్యాల సైన్యాలను వెళ్ళి దేవగిరిని చుట్టుముట్టమన్నాడు.
ఎనుబది ఘటికలు మహాదేవరాజుకు ముందుకువచ్చిన గోన గన్నారెడ్డి సాహిణి తనసేనను అర్థచంద్రవ్యూహంగా బండరాళ్ళవెనుక, చెట్లవెనుక, పొదలవెనుక