200
గోన గన్నా రెడ్డి
ఇవన్నీ ఒక జీవితనాటకంలో భాగాలు. తానూ పురుషవేషం వేసుకొని యుద్ధం చేసింది. లోకంలో ధర్మం నిలబెట్టుతున్నామనీ, విజయం పొందుతున్నామనీ విఱ్ఱవీగుతూ తోటిమానవుల్ని హతమారుస్తుంటాము. ఆ మానవులు, శ్రీకృష్ణ భగవానుడు వచించినట్లు ఇదివరకే చచ్చినవారు!
చిన్ననాటి తన ఆటలు - చిన్న పూరిళ్ళలో ఆటలకన్న ఏమి ఎక్కువ ఆనందము తనకు సమకూర్చాయి? బీదబాలికకూ, తనకూ ఆనందం ఒకటే! తన చదువులు, బీదబాలిక చదువులకన్న ఎక్కువా? ఎక్కడ ఉన్నదీ ఆనందం? జీవితపరమావధి ఏమిటి?
ఇంతట్లో రుద్రమహారాజు అక్కడికి వేంచేసినారు.
“చెల్లీ, నువ్వు ఆనాడు చేసిన మహాయుద్ధము నేను నా జన్మలో మరువను. నువ్వు రెండుసార్లు నా ప్రాణం రక్షించావు. అలా చల్లగా ఏమీ తెలియనట్లు ఉంటావు. నీకు ప్రతి ఏమిచేయగలను? దారిపొడుగునా నువ్వు నన్ను కోరిన కోర్కెనుగూర్చి ఆలోచిస్తున్నాను.”
“అక్కా, నేను మీ ప్రాణం రక్షించానా? ఎందుకు అబద్ధాలాడుతారు?”
“మంచిదానివేలే! నిజం చెప్పనీయకపోవడంకూడా నేర్పేనా? సరే నీపని చెబుతా ఉండు.”
15
విజయయాత్ర నిర్విఘ్నంగా జరిగినందుకు కాకతమ్మ, ఏకవీరాదేవుల పూజ జరిగింది. సంక్రాంతినాడు, ఆ పూజకు సర్వసామంతులు ఆహూతులైనారు. సర్వ సేనాపతులు, సామ్రాజ్యోద్యోగులు, మహాపండితులు, కవులు, గాయకులు, శిల్ప బ్రాహ్మణులు, తక్కిన నియోగాల నాయకులు అందరూ వేంచేసినారు. నిడుదప్రోలు నుండి చాళుక్యప్రభువు అరుదెంచినారు. విద్యానాథకవీంద్రుని తండ్రిగారు వేంచేసినారు.
అ పూజలు మూడు రోజులు జరిగినవి. కాకతమ్మ, ఏకవీరల బంగారు విగ్రహాలు ఊరేగినవి. ఈ ఉత్సవము కేవలం రాజోత్సవము. విజయచిహ్నమైన ఈ ఉత్సాహం యావత్తూ అర్షసాంప్రదాయంగా నడిచింది.
ఈ మహోత్సవాలు, సంక్రాంతి పండుగలు రుద్రదేవి హృదయంలో మాత్రం సంతోషం నింపలేదు.
రుద్రదేవి మరల చాళుక్య వీరభద్రమహారాజును దర్శించగానే ఆమె సంపూర్ణస్త్రీ యైనది. ఆయనకు తెలియకుండా స్త్రీవేషముతో ఆయన్ను సందర్శించవలయునని రుద్రమదేవికి గాఢకాంక్ష కలిగినది. కాని ఆ పనివలన ఫలమేమి? రిక్తకాంక్షలు జీవితములో అనవసరావేదనలు ఉద్భవింప