పుట:Geetha parichayam Total Book.pdf/21

ఈ పుట ఆమోదించబడ్డది

ఇతరులు కూడ చెప్పుకొనునట్లు, అర్థభావములతో కూడుకొన్న భగవద్గీత మనకు కావలెను. హేతువాదుల, నాస్తికవాదుల సంశయములను తీర్చి వారిని కూడ ఆస్తికులకంటే గొప్పగ దేవుని విశ్వసించునట్లు చేయు భగవద్గీత ఎంతో అవసరము. అటువంటి భగవద్గీతను గుర్తించాలంటే ముందు దాని వివరము, పరిచయము కొంతయిన తెలియాలి. గీతను గురించి ముందు తెలియవలసిన వివరమే ఈ "గీతా పరిచయము". భగవద్గీత అంటే ఏమిటో తెలియాలంటే తప్పనిసరిగ గీతాపరిచయము చదవాలి. గీతాపరిచయమును చదివిన తర్వాత గీతను సులభముగ అవగాహన చేసుకోవచ్చును.

ఇంతవరకు శాస్త్రములను, పురాణములను విడదీసిచెప్పిన మేము శాస్త్రబద్దముగ భగవద్గీతను వ్రాయడము జరిగినది. అదియే "త్రైతసిద్ధాంత భగవద్గీత". త్రైతసిద్ధాంత భగవద్గీత ఆధ్యాత్మికవిద్యలో ఒక పెద్దమలుపులాంటిది. దీనిలో ఎన్నో కల్పిత శ్లోకములను నిర్దాక్షిణ్యముగ తీసివేయడము ఒక ముఖ్యవిషయమైతే, గీత 17 అధ్యాయములేనని, ఒక అధ్యాయమును తీసివేయడము మరియొక సంచలన విషయము. త్రైతసిద్ధాంత భగవద్గీతలో దాదాపు 50 శ్లోకములకు భావమే మార్చి వ్రాయడము ఒక విప్లవములాంటిది. గీతలోని పురాణవిషయములను ఖండించి స్వచ్ఛముగ గీతను శాస్త్రముగ తీర్చిదిద్దడమైనది. ఎన్నో మలుపులు తిరిగిన "త్రైతసిద్ధాంత భగవద్గీత" ను చదువుటకు ముందు గీతాపరిచయమును చదివితే గీత సులభముగ అర్థము కాగలదు. గీతలో ఇప్పటివరకు ఏమున్నదో, ఏముండవలయునో తెలియుటకు, గీతయొక్క పేరులో గల అర్థమును మొదట వివరించుకొనుచు, గీతా పరిచయమును మొదలు పెట్టెదము.

"గీత" అంటే ఎందరో పెద్దలు ఎన్నో అర్థములు చెప్పివున్నారు. కాని మనందరికి సులభముగ తెలిసిన పద్ధతిలో "గీత" అంటే "హద్దు" అని తెలుసు. రామాయణములో ఒకనాడు లక్ష్మణుడు కూడ ఈ గీతను దాటవద్దని ఒక హద్దును ఏర్పరచి అడవిలోనికి పోయాడని అందరికి తెలుసు. అలాగే ఈ