5
నెల్లూరు పయొనీర్
వెంకటగిరి సంస్థానంలో కొన్నాళ్ళు
నరసయ్య ఏ పరిస్థితులలో మద్రాసు విడిచి పెట్టవలసి వచ్చిందో తెలియదు. ఉద్యోగంలో అసంతృప్తి ఒక కారణం కావచ్చు. ఆ రోజుల్లో పచ్చయ్యప్ప విద్యా సంస్థల యాజమాన్యం ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించడంలో పక్షపాత దృష్టితో వ్యవహరించేదనే అపవాదు ఉంది. నరసయ్య తండ్రి 1867 ప్రాంతంలో చనిపోయాడు.1 ఇద్దరు అన్నలు ఉద్యోగాలు చేసుకొంటూ, వేరు కాపురాలు ఉంటున్నారు. ఈ దంపూరు సోదరులు ఉమ్మడిగా నిర్వహించిన నేటివ్ అడ్వొకేట్ పత్రిక వల్ల అప్పులపాలై ఉంటారు. విధిలేని పరిస్థితుల్లో నరసయ్య వెంకటగిరి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటాడు.
వెంకటగిరి (నెల్లూరుజిల్లా) జమిందారు సర్వజ్ఞకుమార యాచేంద్ర తన పెద్ద కుమారుడు, పదేళ్ళ పసివాడు అయిన రాజగోపాలకృష్ణకు ఇంగ్లీషు నేర్పించడానికి సమర్ధుడైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న సమయంలో నరసయ్య ఇంగ్లీషు పాండిత్యం గురించి విని ఉంటాడు. ఈ జమిందారుకు నరసయ్య బావ గుర్రం వెంకన్న శాస్త్రితో పరిచయం ఉంది. వెంకన్నశాస్త్రిని మొహమాటపెట్టి నరసయ్యను