26
దంపూరు నరసయ్య
నిజాన్ని సంతోషంగా అంగీకరించినపుడు, అందుకు ప్రతిఫలం ఏదీ ఆశించనపుడు, అది అంత చెడ్డ సంగతేమి కాదు కదా?
డి. నరసయ్య
పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాల,
16 ఫిబ్రవరి, 1867
మొదటి లేఖ
ఈ లేఖ సి.వి. రంగనాథశాస్త్రి పేరుతో, 1865 జూలై 13వ తారీకు మద్రాస్ టైమ్స్ లో ప్రచురించబడింది. బాల్యవివాహాలను నిరసిస్తూ రంగనాథశాస్త్రి ఈ లేఖ రాసినట్లు సుందరలింగం పేర్కొన్నాడు కాని, ఈ లేఖలన్నిటికీ నరసయ్యే కర్త అని గుర్తించ లేదు.19 తన పేరుతో ఇతరులెవరో పత్రికకు లేఖ రాస్తే, రంగనాథశాస్త్రి అంతటి ప్రసిద్ద వ్యక్తి ఎందుకు ఊరుకొని ఉంటాడు? తానా లేఖ రాయలేదని ప్రకటించకుండా ఉండడు. ఆయన అటువంటి లేఖరాసి ఉంటే మద్రాస్ టైమ్స్ తప్పకుండా ప్రచురించి ఉండేది. ఆనాటి మద్రాస్ టైమ్స్ నుంచి, ఇతర ఇంగ్లీషు పత్రికల నుంచి అంత తరచుగా 'కోట్' చేసిన సుందరలింగంగాని, లెనార్డ్ గాని ఈ విషయాన్ని విడిచిపెట్టి ఉండరు. రంగనాథశాస్త్రితో నరసయ్య సోదరులకు పరిచయం ఉండి ఉంటుంది. అప్పుడప్పుడే విస్తరిస్తున్న సంస్కరణ భావాలకు అందరూ సుముఖలు కావడంవల్ల, బాల్యవివాహాలను తిరస్కరిస్తూ తన పేరుతో నరసయ్య లేఖరాసినా, రంగనాథశాస్త్రి మౌనంగా ఉండి ఉంటాడు. నరసయ్య పసివయసును, వ్యక్తిత్వాన్ని బట్టి కూడా మన్నించి ఉంటాడు.
రంగనాథశాస్త్రి అభిప్రాయాలను మొదట వివరించవలసిన అగత్యం నరసయ్యకు ఉంది. తర్వాత బాల్యవివాహాలను సమర్థిస్తూ వెంకన్నశాస్త్రి వాదాన్ని వివరించడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. రంగనాథశాస్త్రి పేరుతో ఉన్న లేఖ అనువాదం :-
ప్రియమైన దేశ ప్రజలారా ! సాటి హిందువులారా ! నేను బ్రాహ్మణుణ్ణి. శైశవావస్థనుంచి సంస్కృతం శ్రద్దగా చదువుతున్నాను. వివిధ మతకర్మలు ఆచరించే సందర్భాలలో, దేశానికి ప్రాణపదమైన వివాహక్రతువులో పఠించే మహామంత్రాల అర్థాన్ని చాలాకాలంగా అనుశీలన చేస్తున్నాను. పసిపాపలకు చేసే వివాహాలు అన్యాయమైనవని, అనాగరికమైనవని, నా పరిశోధనలో తేలింది. ఈ వివాహాలు లోకజ్ఞానానికీ , వివాహ సందర్భంలో పఠించే మంత్రాలలో వివరించబడిన సిద్దాంతాలకూ, వివాహ విధులకు ఆధారమైన శాస్త్ర గ్రంథాలకూ విరుద్ధమైనవి. బాల్యవివాహాల మీద, ఇంకా రెండు ముఖ్యమైన విషయాలమీద నా అభిప్రాయాలను ప్రచారంచేస్తూ వచ్చాను. వీటికి పండితుల సమర్ధన సంపాదించాను. వారు నాతో గొంతు కలిపారు. మన ఆధ్యాత్మిక గురువు పూజ్యులు శ్రీమత్ శంకరాచార్యులవారి సమక్షంలో, సుప్రసిద్ధులైన మన మిత్రులు, గౌరవనీయులు అనంతరామశాస్త్రి బాల్యవివాహాలమిద త్వరలో చర్చ ప్రారంభిస్తారు.