ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ద్విపదభాగవతము

యిచ్చ నెంతయుమెచ్చి యిట్లని పలికె.
“సర్వభూతాత్మక! సతతంబు మెలఁ(ఱఁ)గు
సర్వజ్ఞుఁడవు నీవు సకలలోకేశ!380
మానుషతను బొంది మహనీయ యిట్టి
జ్ఞానాధికుండౌట చర్చింపనరుదు!
యోగమాయారూఢి నొనరిన నిన్ను
యోగీంద్రులును గాన నోపరు కృష్ణ!
ఏయుగంబులయందు నెవ్వరు మున్ను
నాయంత నెఱుఁగరు నలినాక్ష నిన్ను!
నీతత్వరూపంబు నెఱిఁ బెక్కుగతులఁ
జేతోగతంబయ్యెఁ జెన్నార నాకు!
నొక్కఁడ వయ్యును నురుపుణ్యమూర్తి!
పెక్కురూపులుదాల్చి పెంపొందుచుండి;
గురుఁడును దండ్రియుఁ గోరి దైవంబుఁ
బరమాత్ముఁడవు పరబ్రహ్మంబు నీవ!”
అని ప్రదక్షిణపూర్వమై వచ్చి మ్రొక్కి
జననాథ! నవ్వుచుఁ జనియె నారదుఁడు
హరియుఁ బదారువేలంగనాజనులు
మరిగి వర్తించిన మహనీయకథలు
చదివిన వ్రాసిన సద్భక్తి విన్న
మదిలోఁన దలచిన మనుజోత్తములకుఁ
గరమొప్ప ధర్మార్థ కామమోక్షములు
దొరకును భవదుఃఖదోషంబు లణఁగు”390
నని చెప్పి శుకయోగి యప్పుణ్యచరిత
లనఘ! వెండియు వినుమని చెప్పదొడఁగె.