పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/697

ఈ పుట ఆమోదించబడ్డది

మహాకవి భోజమహారాజు

801

కావున సంస్కృతాంధ్రభూయిష్ఠ మగుసాహితియుఁ గవితాచాతురియుఁ గలకృష్ణదేవరాయల వంటి ప్రభువతంసులే "ఆంధ్రభోజపదము" వహింపఁ దగువారు కాని యాశక్తి లేనివారందుల కర్హులు గారని సహృదయుల పోకడలు తెల్పుచున్నవి. ఇట్టిస్థితిలోఁ బంతులవారు “వారి వ్రాఁతను బట్టి పీఠికాపురాధీశుల “నాంధ్రభోజుఁ” డని యన్వర్ధముగా ననుట వారి కిష్టము కాక యున్నట్లగపడుచున్నది" అని వ్రాయుట యవిచారమూలకము. తిరుపతి వేంకటేశ్వరులకే కాదు, విజయనగర మహారాజుగారికి, రామాభ్యుదయ గ్రంథకర్త యగు నయ్యలరాజు రామభద్రకవికి, వీరికి వారికి నననేల? యావదాలంకారిక గ్రంథకర్తలకు వారొనర్చిన "తద్భిన్న త్వేసతి తద్గతభూయోధర్మవత్త్వమ్" అను నుపమాన లక్షణమునందలి “భూయోధర్మవత్త్వమ్" అను విశేషణమునకుఁగూడ మా మిత్రులు పోల్చిన పోలిక సమ్మతము గాదనుట కింతకన్న వ్రాయ నక్కఱ లేదు. తత్త్వాన్వేషణ మొనర్చి యుపమానకల్పన చేయుదుమేని యొకరొప్పకున్నఁ బోవునా? అట్లుకానిచో నెందఱొప్పిన నేమగును? "త్వయి ప్రసన్నే మమ కింగుణేన త్వ య్యప్రసన్నే మమ కిం గుణేన" ఉపమాది కల్పనలయందు రచయితలు పరిశీలకులుగాఁగూడదు. అతీతవిషయములయందెట్లయినను, అనతీతములగు సందర్భములలో నీపరిశీలనా శూన్యత్వ మపహాస్యాస్పదము కాకమానదు. దానిచే వర్ణ్యమున కది గుణాధాయకము కాక యన్యథా పరిణమించును.

ఉ. ఆవల నెవ్వఁడేని కవి యల్లినపద్యములం బఠించుచో
    “నీవిధమెల్ల నిశ్చయమ యీనుతికిం దగు నీతఁ" డంచు సం
    భావనగల్గఁగావలయు భావ మటుల్ గనుపట్టకున్న నా
    దేవురుఁగొట్టుపద్దెముల దీవన లేమిటి కప్పరాడ్విభూ.

మఱియుం బంతులవా రననుగుణోపమానకల్పన మొనర్చి యది సహృదయ సమ్మతముగా దని తెల్పిన మీఁద దాని సాధించుటకు దర్భనిష్ట మగుదాతృత్వాదికమును విస్తరించుచుఁ దుట్టతుదను “ఎవరు నాయనలారా? ఇట్లు చేయువారు?” అనునొక సాహసోక్తిని వ్రాసియున్నారు. గద్వాల, వనపర్తి, ఆత్మకూరు సంస్థానములలోని పరీక్షలు, సమ్మానములు పంతులవారెఱుఁగరో? ఆ సంస్థానములలో విద్వాంసుల విషయమున నగుచున్న ద్రవ్యవ్యయము ప్రతివత్సరము లక్షకుఁ దక్కువకాదు. అందు గద్వాలలోనే నేటేట నేఁబదివేలు, తక్కురెండు సంస్థానములలో నేఁబదివేలకుఁ దగ్గదు. ఇవి తరతరముల నుండి జరుగుచున్నవి. ఆ ధర్మవ్యయము నెఱిగియు "ఎవరు నాయనలారా?" అని మా మిత్రులు ప్రశ్నించు టేటికో? మఱియు నూజివీటిని నిన్నగాకమొన్న 28 వత్సరముల