కర్ణాటకలహం
701
సమర్థించడానికి పనికిరావన్నంతవఱకు ఆ ధ్వన్యాలోకంకూడా చూడనక్కఱలేదు. ఆనాఁటి లక్షణకర్తలలో ఆయా విషయాలలో యత్కించితు మతభేదాలు వున్నప్పటికీ "అపశబ్దములతో, నికృష్టపురుషచరిత్రలతో" నింపఁబడిన కావ్యరచనను ఆమోదించడం సర్వకల్ల. యేరసమో నవరసాలలో వొకటి ప్రధానంగా పుచ్చుకొని,
ఆ.వె. “ఆఢ్యుఁడొక్కఁడున్న నందఱుఁ బూజ్యులే
లెక్కమీఁద సున్న లెక్కినట్లు
అతఁడు వోవుమీఁద నంద ఱపూజ్యులే
సున్న మీఁద సున్నలున్నయట్లు"
అన్నరీతిగా రచిస్తే దానిచాటున అన్నీకమ్ముకుపోతాయి గాని శ్రీమతే... దేవ్యైనమః అన్నట్టు ప్రధానంగానే అశ్లీలంగా (1) అమ్మా! మాదాకవళం, (2) మహారాజులు తల్లీ, కళ్లలేవు. అవిన్నీ యెత్తుకొని (అనంతర చరణాలలో మంగళార్థకాలు వుంటే వుంటాయిగాక) దాన్ని అభ్యుదయార్థం జరుగుతూ వున్న గృహప్రవేశసభలో చదవడానికి యేపూర్వ లాక్షణికోక్తులు సమ్మతిస్తాయి? “రసో౽_ంగిత్వేన వినివేశితవ్యః" అన్నవాక్యానికి యీ దిక్కుమాలిన నికృష్టులకు సంబంధించిన యేడుపురసాన్ని అంగిగా చేయవలసిందని తాత్పర్యం కాదు. నాయకనిష్ఠ శోకంకూడా ఆహ్లాదాన్ని పాఠకులకు కలిగిస్తుందని వ్రాసిన వారిహృదయంకూడా వేఱు. వ్రాస్తే చాలా వ్రాయాలి. “శ్లో విద్యావినయ సంపన్నే" అనే శ్లోకార్ధాన్ని దుర్వినియోగం చేస్తే యేలా వుంటుందో? ఆలాక్షణికోక్తికి దీన్ని లక్ష్యంగా చూపి సమర్థించడమూ ఆలాగే వుంటుందంటే చాలును. వినేటప్పటికి యేవంగా వుండేది లాక్షణికోక్తులద్వారా నిడివి మీఁద సమర్ధింపఁబడినా ప్రయోజనంలేదు. (వామన ఇతి త్రివిక్రమ మభిదధితి దశావతారవిదః) అదిగాక ఇది పండితులకొఱకా? పామఱులకొఱకా? అని అధికారినిర్ణయప్రశ్న వస్తే, నా౽ద్యః. యెందుచేత నంటే? వారు బొత్తిగా దీనివంకకు చెవిపెట్టరు. పెడితేవారికి ఈ లాక్షణికోక్తులు అవగతమై వుంటాయి కనక సమర్థించుకొని ఆనందిస్తారే అనుకుందాం, చెవినేపెట్టరుగదా! నద్వితీయః. వాళ్లకి ఆనందవర్ధనాచార్లెవరో గోవర్ధనాచార్లెవరో తెలియనే తెలియదుకదా? యిఁక యీరచన యెవరికోసం? స్వాత్మానందంకోస మనుకోవాలి. పడవలులాగేవాళ్లూ, బళ్లుతోలేవాళ్లూ దీనికి అధికార్లనుకుందామా? వాళ్లకి యే పచ్చిశృంగారమేనా వుండాలి. "యెంకత్తకడియాలు" వగయిరాలు చూ. ఆయీకారణాలను బట్టి చక్కనిసాహిత్యజ్ఞానాన్ని యీవిధంగా వ్యర్థపుచ్చవద్దని గేయకర్తగారికి నాసలహా. నువ్వెవరు? నాకు సలహా యివ్వడానికంటే? యీసలహానన్ను విశ్వసించే శిష్యోపశిష్యులకేనా వుపకరిస్తుందని ఆశిస్తాను.