పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/593

ఈ పుట ఆమోదించబడ్డది

697


కర్ణాటకలహం

యీమాట మృచ్ఛకటికలో చూచాను. యిప్పుడు అనుభూతమయింది. “అమ్మా! మాదాకవళం" నాకు కవిత్వంలో చేరుతుందని తోఁచలేదు. అది కవిత్వంలో చేరే పక్షంలో ఆ బాపతువాళ్లంతా కవులలోనేవచ్చి కూర్చోవచ్చు, “ఛందోవ్యాకరణాదివిత్" అనేదానికి సంబంధించిన యోగ్యతతో పనిలేనట్టు ఆ గేయ పల్లవి తెల్పుతూవుంది. అయితే, ఆగేయ పల్లవిని వుచ్చరించిన వ్యక్తి మహావిద్వాంసుఁడు కావడంచేత "ప్రసిద్దే౽పి ప్రబంధానాం” వగయిరా ధ్వన్యాలోకశ్లోకాలు వుదాహరించి “అమ్మా! మాదాకవళ" ప్రబంధాన్ని సమర్థించడం జరుగుతూ వుంది. తక్కిన దీనులకు ఆయీపాండిత్యం లేకపోవడంచేత సమర్ధనం వుండదు. అంతమాత్రంచేత వాళ్లనోటమ్మట వచ్చింది ‘మహాప్రబంధం' కాకపోతుందా? మూలంలో 'ప్రబంధానామ్‌' అని మాత్రమే వుంది గాని, వ్యాఖ్యానంలో – “ప్రబంధాదిషు మహాకావ్యాదిషు' అని ఉన్నది. అందుచేత ఆభిక్షులు వుచ్చరించిందిన్నీ - మహాకావ్యమే కావలసివస్తుందనుకోవాలి. మనది రసవంతమై అది నీరసమనడానికిన్నీ అభియుక్తులొప్పరు. “శ్లో శిక్షుణా కక్షనిక్షిప్తః కిమిక్షుర్నీరసో భవేత్." చెప్పొచ్చే దేమిటంటే వీళ్లందఱూ కవులేకావడం "అస్మద్గోత్రం వర్ధతాం"గా పరిణమించి మనబలం అభివృద్ధికావడం అభినందనీయమే అయినా, ఆనంద వర్ధనాచార్యులవారి వుద్దేశం అట్టిదేకాదని స్పష్టంగా 'ప్రబంధపదం' చెపుతూ వుంది. ప్రబంధలక్షణం ఆ ఘట్టంలో ఆయన వ్రాయకపోయినా (అనుక్తమన్యతః) “మహాపురుషచారిత్ర ముదాహరణ మర్దతి" అనే అంశం ఆయన 'తోసిరా' జనేవారుకారు. ఈ “మాదాకవళం"లో యే మహాపురుష చరిత్రం వుదాహరించఁబడిందని దీన్ని ప్రబంధంగా అంగీకరించేది? కనక దీనిసమర్థనానికి ఆశ్లోకం వుదాహరించడం దుర్వినియోగం చేయడం అనినొక్కివక్కాణించవలసి వచ్చింది. గేయకర్త చెప్పవలసిన జవాబు యేలా వుంటే వుపయోగిస్తుందంటే? "మేము నాయకుని ధీరోదాత్తత్వాదులు వగయిరాలుగాని మఱికొన్ని సుగుణాలుగాని చూచేది లేదు. ఇంతేకాదు, మాకు వ్యాకరణాదులతో అవసరం లేదు, యేదేనా వొకవిషయాన్ని బోధించేదల్లా కవిత్వమే అని మా అభిప్రాయం" అంటే టక్కున సరిపోయేది. ఆలా సమాధానం చెపితే, నన్నయ్యగారు

  • కర్ణాటకలహం అంటే యేదో కవ్వించి వివదించడం.