పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/388

ఈ పుట ఆమోదించబడ్డది

392



“పుణ్యైర్యశోలభ్యతే"

అంటూ తఱచుగా పెద్దలు వాడుతూవుంటారు. ఇది చాలా గమనించతగ్గది. యీ మాటే కాదు, తఱచుగా పెద్దలు వాడేవాట్లల్లో యేవిన్నీ అననుభూతమైన సంగతులు కనపడవు. ప్రస్తుతం యీ మాటనుగుఱించి నా అనుభవాన్ని కొంచెం వ్రాస్తాను. దీన్ని చూచి ప్రస్తుతం నాకు ప్రతి పక్షులుగా వుండేవారు గేలిచేయడం యేలాగా తప్పదనుకోండి. నాయందు ప్రేమాతిశయం కలవారిలో కూడా కొందఱు "యద్దేవ" చేస్తారని నాకు పూర్తిగ తెలుసును. తెలిసిన్నీ వ్రాయడమెందుకంటే దీనిలో కొంత "అహంకార నిరాసా"నికి పనికివచ్చే విషయాలుకూడా వుండడంవల్ల యెక్కువ పరిశీలకులైనవారు వాట్లను అభినందిస్తారనిన్నీ యింతేకాక యింత వయస్సు వచ్చీకూడా యీ అంశాన్ని వ్రాయకపోతే పలువిధాలుగా అనుమానించే లోకులకు యథార్థం యేలా బోధపడుతుందనిన్నీ సాహసించి వ్రాస్తూవున్నాను.

లోకంలో ఆచారం యేలావుందంటే, యెవరేనా తన్ను గూర్చి “మీరు అంతవారు యింతవా"రని అన్నప్పుడు "సరి, నేనెంతవాణ్ణి, మీ పాదధూళినికూడా పోల" ననడమున్నూ "నీవు శుద్ధ శుంఠ" వని కర్మంచాలక యెవరేనా అన్నట్టయితే "నీవు శుద్ధ శుంఠ"వని యెదురుకొని తిట్టడమున్నూ అనుభూతంగా తెలుస్తూవుంది. పయికి వినయమెంత నటిస్తూవున్నప్పటికీ ఏదో విద్యలో ప్రవేశముండి నలుగురులో అంతో యింతో పేరున్నవాఁడికి యేకొంచెమో అహంకారం వుండితీరుతుందిగాని "నాకేం వచ్చును. నేను శుంఠను" అనే భావం మాత్రం వుండదు. దీనికి యెన్నో వుదాహరణాలు చూపవచ్చును. యెక్కువ తెలివితేటలు కలవాఁడైతే గంభీరంగా ఆత్మశక్తిని ప్రకటించుకుంటాఁడు. అవి కొంచెం తక్కువ వున్నవాఁడైతే వున్న దున్నట్లుగా ప్రకటించుకొని "గర్విష్టి" అనిపించుకుంటాఁడు. మచ్చుకు ఒక్కటి చూడండి. కాళిదాసేమన్నాడు?

"అభిరూపభూయిష్ఠా పరిషదియం, తదత్ర కాళిదాస గ్రథితవస్తునానవేన నాటకే నోపస్థాతవ్య మస్మాభిః".

అని కాఁబోలును తన ప్రజ్ఞావిశేషాన్ని గూర్చి గంభీరంగా తెలుపుకున్నాఁడు. దీన్ని లోఁతుగా ఆలోచించకుండా “యేమీ వ్రాసుకోనేలేదు కాళిదాసు, నిగర్వచూడామణి"