పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/346

ఈ పుట ఆమోదించబడ్డది

350

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


“సువర్ణపాత్రికం" రెండంకాల ప్రాంతంలో ఆఁగడమున్నూ “వ్యసనవిజయం" కూడా డిటో స్థితిలోనే ఆఁగిపోవడమున్నూ పైదాన్ని సమర్థిస్తాయి. యింకా మఱికొన్ని యీలాటి చిలకకొట్లయితే వున్నాయిగాని అవి చక్కనిశైలిలో లేవు. ఆ మొదటి రెండు గ్రంథాలూ అవసానకాలంలోనికి కావు; అవసాన కాలానికి సుమారు పుష్కరకాలానికి పూర్వపువే. మొదలు పెట్టేటప్పుడే పర్యవసానం ఆలోచించుకొని మొదలుపెట్టడం అతనిపంథకాదు. ఆరంభించి, తోఁచినట్టువ్రాసి, యెక్కడ తోఁచకపోతే అక్కడ విరమించడమే అతని ఆచారం. పై పుస్తకాలు రెండూ తరవాయి నన్ను పూరించమని నా కిచ్చాఁడు. అవి ప్రకరణాలుగా తయారు కావలసినవి. పది అంకాలు వుంటేనే కాని ప్రకరణానికి పూర్వలాక్షణిక పద్ధతిని వొప్పించడానికి వీలు కనపడదు. “పై కథావిధానానికి నీమనస్సులో యేమి వూహ పెట్టుకున్నా" వని అడిగాను నేను. "యేమీ పెట్టుకోలేదు. నీవు చూచుకో వలసిందే" అన్నాఁడు. “అలాగైతే అవి అలా వుండవలసిందే. నీకులేని వూహ నాకెక్కడనుంచి వస్తుందని నేనన్నాను.

"పరిణతి రవధార్యా యత్నతః పండితేన" అనే భర్తృహరి వాక్యాన్ని ప్రతికవిన్నీ అనుసరించి తీరాలి. అది అతcడు యే విషయంలోనూ పాటించేవాఁడు కాఁడు. గ్రంథారంభం చేసేటప్పటికే ముగింపు మనస్సులో నాటుకుపోవాలి. కాని ముగింపును గూర్చి యెప్పుడో ఆలోచిద్దామంటే కార్యకారికాదు.

అతణ్ణి నేను గీరతంలో, “తిరుపతిసింహ మొక్కమొగిఁ దీవ్రతరమ్ముగవచ్చి" అని రూపించి వున్నాను కాని అంకుశంతో సంబంధించిన గజప్రకృతిగా నిరూపించవలసిన ప్రకృతిగా నేను అనుభవపూర్వకంగా యెఱిఁగివుండడంచేత కొన్నిచోట్ల ఆభావాన్నీ వెల్లడించివున్నాను.

చ. "తిరుపతి యేన్గుగాఁగ గడి దేఱినశిష్యు లనేకు లొప్పుమైఁ
     బొరిఁబొరి రోఁజుచున్ దనదు పొంతను బెబ్బులిపిల్లలట్టు చూ
     పఱులకుఁదోఁపఁ గేల నొక పాటిది బెత్తము పూని వేంకటే
     శ్వరుఁడు శతావధాన మను సర్కసుcజూపెడిఁ జూడుcడో బుధుల్”

అని నేను తన్ను యేనుఁగుగా రూపించి పద్యం చెప్పేటప్పటికి దానికి అంతగా అంగీకారం లేకో యేమో.

చ. "తిరుపతి వ్యాఘ్రమై బయలు దేఱినశిష్యులు గున్న యేన్గులై
     వఱలఁగఁ దేఱఁగాఁ తగిన వారలు బెబ్బులిపిల్ల లెల్లమా