పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/343

ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

347

అని వ్రాసుకున్నాము. మా యిద్దఱికన్నా సాహిత్యంలో యెక్కువ గ్రంథాలు చదివి వ్యాకరణం చదువుకోవడానికి వచ్చిన వక కోనసీమ విద్యార్థి యీ శ్లోకాన్ని ఆక్షేపించడానికి బదులు మా యిద్దఱిదగ్గిఱా కావ్య పాఠం చెప్పుకొనే విద్యార్థులను “వీరు పశుపతి దయితా (పార్వతీదేవికి) "తృతీయ పుత్రులు" అంటూ వెక్కిరించడం మొదలు పెట్టడమే కాకుండా యిద్దఱిలోనూ వకరు తృతీయపుత్రులైతే రెండోవారు చతుర్థపుత్రులు కావలసివస్తుం దంటూ ఆక్షేపించడం జరిగింది. దీన్ని సమర్ధించిన విధానం యిక్కడ వ్రాస్తే చాలా పేజీలు పెరుcగుతుంది గనక వుపేక్షిస్తాను. యీ అభిప్రాయం న్యాయంగా సమర్ధించతగ్గదే గాని పిడివాదం చేసి సమర్థించేది కాదని చదువరులు తెలుసుకోవాలి. సారాంశం పార్వతీదేవికి పుత్రులిద్దఱే అనిన్నీ అందు వొకఁడు విఘ్నేశ్వరుఁడనిన్నీ రెండు కుమారస్వామి అనిన్నీ మూఁడు తి. వెం. కవులనిన్నీ ఆరోపిత పుత్రత్వానికి అందఱూ అర్హులే కనక, యెవరు ఆలా ఆరోపించుకుంటే వారందఱున్నూ ప్రత్యేకించి ప్రత్యేకించి మూఁడోవారుగానే పరిగణింపఁబడతారు. భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు వక పురుషుఁడు. 'తండ్రీ' అని సంబోధిస్తాఁడు. ఆ పురుషుఁడు కొడుకుకూడా “తండ్రీ" అనే సంబోధిస్తాఁడు. అంతేకాని తండ్రికి తండ్రి కనక వాఁడికి భగవంతుఁడు తాత కావాలనే శంక యేలాటిదో పైశంకా ఆలాటిదే. అయితే వ్రాసేది లేదని కూడా కొంచెం వ్రాశాను, యింకా వ్రాయాలి. దాన్ని వాదోపవాదనిష్ణాతులైన చదువరులే పూరించుకుంటారని తలుస్తాను. చెప్పొచ్చేదేమిటంటే? యీలాటి 'కైకురుబొయికురు' పోట్లాటలతో బ్రహ్మయశాస్త్రులుగారివద్ద చదువుకున్న ఐదారేళ్లున్నూ రేయుంబవళ్లు కాలంనడిచింది. దానితో నా సంస్కృతసాహిత్యంకూడా దిట్టపడింది. (వారి విద్యార్ధిత్వం యెంత సేపూ సంస్కృతానికే తప్ప తెలుక్కి సంబంధమే లేదు. కాలేజీలో ఇంగ్లీషుమాదిరిగా తెలుసుకోండి.) దీనికంతకీ బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారి శుశ్రూషే కారణమవడంచేత గురువు లెందఱో వున్నా శ్రీహరిని ప్రధానంగా స్మరించడం. గాని “గురుభ్యోనమః" అనకుండా నేర్చుకున్న భాగంకూడా కొంతవుంది. దానికి గురువులు తోటివిద్యార్థులు. ఆ విద్యార్థులకూ మాకూ "అన్యోన్యం గురవోవిప్రాః” అనేమాదిరి గురుశిష్యభావం వుందనుకోవాలి. అంతేనేకాని వ్యాకరణంతోపాటు బ్రహ్మయ్య శాస్త్రుల్లుగారు నాకుఁగాని, ఇతరులకుఁగాని సాహిత్యగ్రంథాలు చెప్పలేదు. వారికి వాట్లలో అంతగా అభిరుచీలేదు, తీరికాలేదు. యేమంటే! గురువుగారు రాత్రి సుమారు రెండుగంటలప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి ఆరంభిస్తే పగలు 12 గంటలప్పటికి ఆఖరుపాఠమవడానికి అవకాశం కలిగేది. తక్కువపాఠం ప్రథమం ప్రారంభించడం సంప్రదాయం. యెక్కువ పాఠం వాళ్లందఱూ తక్కువ పాఠాలు వింటూ వుండాలి. యీలాటివిషయాలే స్వయంకృషివల్ల విద్య సాధించేవారికి తెలియకపోయేవి. యీలాటివిన్నీ