పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/315

ఈ పుట ఆమోదించబడ్డది

మా ముత్తాత

319

నాకు చేతనైనంతలో మా ముత్తాతగారి కవిత్వాన్ని గూర్చి వ్రాశాను. ఆయన యేమనుకుంటారో?

తే.గీ. పుత్రవతిరీతి పృథుకసంభూతిసమయ
       గర్భనిర్భర వేదనావిర్భవంబు
       వంధ్యలెఱుఁగుట యెట్లు? కావ్యప్రయాస
       సుకవులకుఁగాక తెలియనే? కుకవితతికి. అనిన్నీ

“కవి చమత్కార గౌరవంబు”

తే.గీ. మనసెఱుంగునుగాక యెవ్వనితరంబు?
       పాటిదెల్పఁగ నాత్మానుభవమురీతి
       కాన ధారాప్రకల్పనకౌశలముల
       ఫణితిఁదెలియుఁడి కవిసార్వభౌములార! అనిన్నీ

యామినీపూర్ణతిలకలో భవిష్యద్విమర్శకులనుగూర్చి వుటంకించియున్నారు. ఆయన యాత్మలో నన్నేమనుకొనునో! తోచింది వ్రాశాను. ఇప్పడీలాటి వ్రాతలకేకాబోలు, “రిసర్చి" అనే టైటిల్సు వస్తున్నాయి. కాని దీన్ని దానివంటిదాన్నిగా చదువరులు భావింపరను కొంటాను. అది యింకా లోతుగా వుంటుంది. తుండూతుపాకీగూడా యెగిరిపోతూ వుంటుంది. దాని ధోరణిలో భారతాంద్రీకరణం రాజరాజనరేంద్రుఁడిదే అయిపోతుందొకప్పుడు. కాబట్టి దానివంటిది యిది కాకూడదు.

ఈయన రచించిన ప్రబంధరాజములలో మొదటిది యామినీ పూర్ణతిలక. రెండవది వెంకటేశ్వరవిలాసము. యిది తుట్టతుది దినములలో రచించినదగుటచేత దీని రచనయే ప్రౌఢవిమర్శకు లగువారికి హృదయంగమంగా వుండవలసి వున్ననూ, పేరుమాత్రం యెక్కువగా మొదటిదానికే వచ్చింది. వేంకటేశ్వరవిలాసం రచించినట్లే నిన్న మొన్నటిదాకా లోకు లెఱుగరు. వీరేశలింగంగారు మొదటిదాన్నేకాని రెండోదాని పేరెత్తనేలేదు. మొదటిదాని శైలి చూపినాను. రెండవదానిశైలికై కొన్ని వుదాహరిస్తాను.

క. భాష్యంబు చెప్పి సకలమ
   నీష్యగ్రణు లెన్నఁబ్రౌఢి నేర్పెద నీకున్
   దూష్యంబులేదు దీనను
   శిష్యా! ఆచెలియ జాడఁజెపుమా మాకున్.