పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/273

ఈ పుట ఆమోదించబడ్డది

పౌరాణికులు నీచులా?

277

 రామాయణాలు రెండూ పురాణాలు కావు. భారతం యితిహాసం, రామాయణం కావ్యం. వేదానికి కూడా అపౌరుషేయత్వాన్ని పలువురు వొప్పరని తెల్విడి. వాల్మీకి మొదటికవి, వ్యాసులు రెండోకవి.

“ఏనాతి ప్రియశిష్యుఁడా నాకు సంభవుం
 డటుమీఁది శిష్యుండు వ్యాసమౌని" (శ్రవణా)

వీరిద్దఱూకూడా యించుమించుపురాణకర్తలే. యిక తెలుగులోనికి వద్దాం. నన్నయ్య, తిక్కన్న, యెఱ్ఱన్న వీరుముగ్గురూ పురాణాంద్రీకరణం వల్ల పౌరాణికులే. లోకంలో ఆంధ్రదేశంలో యీత్రితయానికి వున్నగౌరవం యెవరికీ లేదుగదా? అట్టివారిని, నీచులుగా అపవదించే వారుంటారని నేననుకోను, వేయిమాటలెందుకు? పురాణాల యందు పూర్వకవులకెంత గౌరవం వున్నదీ పెద్దన్నగారి వాక్యమే తెల్పుతుంది.

(1) "అతుల పురాణాగమేతిహాసకథార్థ"

(2) "బ్రహ్మాండాది నానాపురాణ విజ్ఞాన నిరతు"

ఇందు రెండోది నన్నయ్యభట్టారకునిది, విస్తరమెందుకు? పురాణాలయందుఁగాని, పౌరాణికులయందుఁ గాని నైచ్యభావంకల ప్రాజ్ఞులున్నట్లు నేను ఎఱుగను నాకు పౌరాణికులయందు చాలా గౌరవభావమే వుంది. పురాణాలయందున్నూ చాలా గౌరవభావమే. కనుకనే దేవీభాగవతమును దెలిఁగించాను. దాన్ని యెవరేనా యెక్కడేనా పురాణం చెపుతూవున్నారంటే అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇతరులకుకూడా ఆలాగే అని నేను అనుకుంటాను. పౌరాణికులంటూ లేకపోతే సంస్కృత పురాణాలుగాని, ఆంధ్రపురాణాలుగాని బూజుపట్టిపోవలసిందే. సర్వేసర్వత్ర ఈ యిరవయ్యో శతాబ్దంలో అంతో యింతో అక్షరజ్ఞానం వుండడంచేత యెవరంతటవారు ఆయాపురాణాలు చదువుకుంటూ వున్నారుగాని యిప్పటికి కొంతవెనక కాలంలో పౌరాణికులే ఆయాచరిత్ర జ్ఞానానికిన్నీ వాట్ల వ్యాప్తికిన్నీ దిక్కు అట్టివారు నీచులని యెవరపవదించినా అది నేను వినలేను. వినినచో దుఃఖింతును. పౌరాణికునిద్వారా వ్యాప్తికి రావడం గ్రంథానికి న్యూనతాపాదకమే అయితే బట్టులద్వారా వ్యాప్తికి రావడం అంతకన్నా అధ్వాన్నం గావాలిగదా! చూడండీ శ్రీనాథుని చాటువు.

క. కవితాకన్యకు నలువురు
   కవి జనకుఁడు బట్టుదాది గణుతింపంగా
   నవరసరసికుcడె ధవుఁడగు
   నవివేకియె తోడఁబుట్టు వనవేమనృపా.