పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/105

ఈ పుట ఆమోదించబడ్డది

సస్యగర్భభూదానం

109


ప్రస్తుతం రాయదలచుకొన్నది భూదానాన్ని గుణించి, అట్టి భూదానాన్ని గ్రహణాది సమయాలలో యిస్తే దానివల్లవచ్చే పుణ్యం కోటిగుణిత మవుతుందని గ్రంథాలలో వ్రాసివుండడంచేత పూర్వరాజులు అగ్రహారాలు వగైరా అట్టి సమయాలలోనే యిచ్చినట్లు మనకు వారివారి శాసనాలవల్ల తెలుస్తూవుంది.

అట్టి భూమి సస్యగర్భంగా వున్నప్పడు దానమిస్తే మరీ పుణ్యమని యొక్కడో వ్రాసివుండడంచేత వక సామాన్య గృహస్టురాలు యే పురాణ శ్రవణ సమయంలోనో ఆ సందర్భాన్ని విని సస్యగర్భభూదానం చేదామని సంకల్పించుకుందని వింటాము. అయితే యీ దానం అన్నది వారి వారి స్థితిగతుల ననుసరించి ఫలప్రద మవుతూవుంటుంది కాని యొక్కువ యిస్తే యెక్కువ పుణ్యమనిన్నీ తక్కువయిస్తే తక్కువ పుణ్యమనిన్నీ లేదు. అనగా వక మహారాజు వక అగ్రహారం దానమిస్తే ఎంతపుణ్యమో వక సంపన్న గృహస్టు వక యొకరం నేల దానమిస్తే అంతేపుణ్యం. యీలాగే వక లక్షాధికారి వక వేయి రూపాయిలిస్తే యెంతో వకభిక్షాధికారి వక కాని ధర్మంచేస్తే అంతేఅని గ్రంథాలు వప్పకుంటాయి. యుక్తికిన్నీ పైసంగతి అనుకూలిస్తుంది. కాని లక్షాధికారి భిక్షాధికారి చేసినట్లుమాత్రం చేస్తే యుక్తంకాదు. అందుకే తన శక్తికొలదిగా దానం చేయవలసిందని చెపుతూ "విత్తశాఠ్యం నకారయేత్ అనికూడా పలుచోట్ల వ్రాసివున్నారు. అదలా వుంచుదాం.

యిపుడు జనశ్రుతిగా వచ్చుచున్న వక సామాన్యగృహసురాలుచేసే సస్యగర్భ భూదానాన్ని గుణించి మాట్లాడుకుందాం. పాపం ఆ అమాయకురాలికి యథాశాస్త్రంగా సస్యగర్భభూదానం చేయాలనివుంది. పండినభూమి నెక్కడతెస్తుంది? అందుచేత యెవరినో ఆశ్రయించి నాలు మూడు పండిన వరివెన్నులతో కూడుకొన్న వక పెద్ద మంటిగడ్డను సంపాదించింది. దాన్ని జాగ్రత్తగా విడిపోకుండా వక పళ్లికతట్టలో పెట్టుకుని యేపుష్కర పుణ్యకాలమందో లేక యే సూర్యగ్రహణ చంద్రగ్రహణ కాలమందో యే కోటిలింగక్షేత్రానికో వచ్చి స్నానంచేసి డబ్బో దస్కమో దక్షిణతో ఆసస్యగర్భభూమిని దానంచేసి తరించినట్లు తృప్తిపడి యింటికి వెళ్లింది. విచారించిచూస్తే ఆ అమాయకురాలికి పుణ్యంవస్తే రావచ్చునేమో కాని అది సస్యగర్భభూదానం అనిష్ఠించుకుంటుందా? యీ మట్టి గడ్డను పుచ్చుకొన్న బ్రాహ్మండు దక్షిణే దక్కుట అనుకొని దాన్ని అక్కడే పారవేస్తాడు. గాని యింటి కేమేనా తీసుకువెళ్లి యేటేటా తాను పండించు కుంటాండా? అది ఆలా పండించుకోవడానికి వీలవుతుందా? కాదు గదా? అయితే ఆవిడకు పుణ్యం మాత్రం యేలావస్తుందని శంక రావచ్చును. ఆమె బుద్ధియందు లేశమున్నూ కళంకం లేదు. కాcబట్టి- “భావనా యదిభవే త్ఫలదాత్రీ మామకం నగరమేవహి కాశీ" అన్నట్లు ఆమె భావనను పట్టి ఆపెకు సుకృతం కలిగితే కలగవచ్చు ననుకుంటాను.