పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/40

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెడ్డిరాజులు

కాకతీయులయొద్దఁ దొలుత దండనాథులుగానుండి తత్సామ్రాజ్యము సన్నగిల్లినతర్వాతఁ బద్మనాయకులవలెనే వీరును స్వతంత్రరాజులైరి. తొలుత వీరిరాజధాని యద్దంకి. తర్వాతఁ గొండవీడు, రాజమహేంద్రవరము, కందుకూరు. వీరు మహాదాతలు. పదమూఁడవశతాబ్దినుండి వీరిపాలనము పెంపొందెను. నూఱుసంవత్సరములకంటె వీరిరాజ్యము మహోచ్ఛ్రయమున లేదు. వెల్గోటివెలమరాజులును, ఒడ్డెరాజులును బ్రబలశత్రువులై యీరాజ్య మంతరింపఁజేసిరి. ఈరెడ్లపరిపాలనక్రమమునుగూర్చి యీక్రిందిసీసపద్యము వాడుకలో గలదు. శాసనములఁ బట్టి పరిశీలించిన నిది మిక్కిలి యక్రమ మగుచున్నది.

సీ. పోలయవేమన్న పొలుపారఁ బండ్రెండు
                    వత్సరంబులు గాచె వసుధయెల్ల
    అటవెన్క ముప్పది యనపోతవేమన్న
                    వన్నెవాసికి నెక్కి వసుధ యేలె
    ధర్మాత్ముఁ డనవేమధరణీకళత్రుండు
                    పదియు నేనిట భూమి పదిలపఱిచె
    ప్రజల కుబ్బసముగఁ బదునాలుగేఁడులు
                    కొమరగి రేలెను సమయుదాఁక
గీ. ఏలెఁ గోమటివేమన యిరువదేడు
    రాచవేమన్న నాల్గువర్షములు నేలె
    మించి కట్టిరి గృహరాజుమేడ కొండ
    వీట నూరేండ్లు రెడ్లు భూవిదితయశులు.