గుణం వుండాలని చెప్పాడు. విశేషంగా ఇతరులు మన హక్కులను భంగపరచినపుడు ఈ గుణం అవసరం, క్రీస్తులో ఈ గుణం సమృద్ధిగా వుండేది. అతడు సాధుశీలుడు - మత్త 11, 28.
9) ఇంద్రియనిగ్రహం. పిశాచం కామాన్ని కలిగిస్తుంది, ఇది ఆ కామానికి వ్యతిరేకగుణం. దీనివల్ల మన అంతరంగిక భావాల్లోను బాహ్య ప్రవర్తనంలోను సంయమనం అలవడుతుంది. మనం భగవంతుని ఆజ్ఞలకు కట్టుపడి వుంటాంగూడ.
3. అపోస్తలుల చర్యలు 2, 43-47లో లూకా యెరూషలేములోని తొలినాటి క్రైస్తవ సమాజాన్ని వర్ణించాడు. ఈ సమాజపు భక్తుల్లో పైన పేర్కొన్న ఆత్మవరాలు స్పష్టంగా కన్పిస్తాయి. ఆత్మే ఈభక్త సమాజాన్ని నడిపించింది. ఈ భక్తులంతా ప్రేమ భావంతో ఐక్యమై సమష్టిజీవితం జీవించారు. తమ ఆస్తిని ఒకరితో ఒకరు పంచుకొన్నారు, దేవాలయంలో అంతా కలసి ప్రార్ధన చేసారు, ఇండ్లల్లో అంతా కలసి భుజించారు. వాళ్ళ ప్రవర్తనలో సంతోషమూ, వినయమూ, సోదరప్రేమా కన్పించింది. ఇవే ఆత్మ ఫలాలు, ఈనాడుకూడ మనం కొందరు క్రైస్తవుల్లో ఈ ఫలాలను చూస్తుంటాం. వాళ్ళు పెద్ద మనుషుల్లాగ, ఓ అమ్మలాగ ఓ నాన్నలాగ, సౌమ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఈలాంటి వాళ్ళంటే మనకు పూజ్యభావం కలుగుతుంది.
19. ప్రభుని స్తుతించాలి
1. క్రైస్తవ ప్రజలు విశేషంగా ప్రభుని స్తుతించి ఆరాధించేవాళ్లు. "మీరు ఎన్నుకొనబడిన జాతి. యాజక రూపమైన రాజ్యం. పవిత్ర జనం, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కృత్యాలను ప్రకటించడానికి ఏర్పరుపబడినవాళ్ళు" - 1 పేత్రు 2,9. కనుక ప్రభుని స్తుతించడం మన బాధ్యత.
పూర్వవేదం భగవంతుని స్తుతించే బాధ్యత యూద ప్రజల దొక్కరిదేనని మొదట్లో భావించింది. అటుపిమ్మట యూదేతరులు కూడ ఆ ప్రభుని స్తుతించవచ్చునని తలచింది, కడపట ప్రకృతి శక్తులు కూడ ఆ ప్రభుని స్తుతించాలని హెచ్చరించింది. యిప్రాయేలుకు మారుగా ఎన్నుకోబడినవాళ్ళు నూత్న వేదంలో క్రైస్తవ ప్రజలు. కనుక ఆ ప్రభుని స్తుతించి కొనియాడ్డం మన ధర్మం. పౌలు తన జాబుల్లో మాటిమాటికీ ఈ స్తుతి ప్రార్థనను పేర్కొంటాడు - ఎఫే 5,19. పెంతెకోస్తు ఉద్యమం ఈ స్తుతి ప్రార్థనను చాలా ఘనంగా ఎంచుతుంది. 2. స్తుతి ప్రార్థనలో ప్రభువు వరాలను కాదు, అతన్నేస్తుతిస్తాం. ఆ ప్రభువు మంచివాడు, కరుణ కలవాడు, పవిత్రుడు, యోగ్యుడు. కనుక అతని కోసమే అతన్ని