2.సీనాయి కొండమీద యావే ప్రభువు తేజస్సు సోకి మోషే ముఖం ప్రకాశించింది - నిర్గ 34,29. కొండమీద క్షణకాలం క్రీస్తు ముఖం ప్రకాశించింది - మత్త17,2. కాని ఉత్తానం తర్వాత అతడు ఆత్మను పొంది శాశ్వతంగా ప్రకాశిస్తాడు. ఈ ఉత్తాన క్రీస్తులోనికే మనం జ్ఞానస్నానం పొందేది. కనుక అతని మహిమ మనలోగూడ ప్రతిబింబిస్తుంది. అది మన ముఖంలోగాక, చేతల్లో ప్రతిఫలిస్తుంది. ఈ మహిమ మనలో రోజురోజుకీ వృద్ధి చెందుతూంటుంది. మనలను క్రీస్తులోనికి మార్చివేస్తూంటుంది - 2కొ 3,18. మనకు ఈ మహిమ సోకడం ఈ లోకంలోనే ప్రారంభమౌతుంది. కాని అది మోక్షంలోగాని ముగియదు. క్రీస్తు కొండమీద పొందిన మహిమ అతని దేహమైన తిరుసభకు కూడ సంక్రమిస్తుంది. అనగా మనమందరమూ అతని తేజస్సులో పాలు పొందుతాం. ఈ భాగ్యానికి మనం ప్రభువుకి వందనాలు అర్పించాలి.
3.కొండమీద క్రీస్తు తాల్చిన మారురూపం మనకు ఓ ప్రత్యేకమైన భక్తిభావాన్ని గూడ పట్టిస్తుంది. కొండ ఎత్తుగా వుండి దేవలోకాన్ని తాకుతూవుందో అన్నట్లుగా వుంటుంది. దానిమీద దేవుడుంటాడు అనే భావం కలిగిస్తుంది. దానిమీది కెక్కిపోతే దైవ సాక్షాత్కారం కలుగుతుంది అనే నమ్మకం కలుగుతుంది. ఈ వద్దేశంతోనే అనాది కాలంనుండీ అన్ని మతాలవాళూ కొండలమీద గుళ్లు కడుతూ వచ్చారు. మన ఆంధ్ర రాష్ట్రంలో గుణదల్లో ఫిరంగిపురంలో, విశాఖపట్టణంలో క్రైస్తవులు దేవుణ్ణి పూజించుకొనే కొండలున్నాయి, ఇవి మన పుణ్యక్షేత్రాలు. కనుక మన క్రైస్తవులు అవకాశం దొరికినపుడెల్లా ఈ పుణ్యస్థలాలను దర్శించాలి. ఈ కొండలమీదికెక్కి ప్రార్థన చేసికొని భగవంతుణ్ణి అనుభవానికి తెచ్చుకొంటూండాలి.
4. క్రీస్తు శోధనలు
క్రీస్తు శోధనలు అనుభవించి పిశాచంమీద విజయం పొందాడు. నేడు మనం శోధనలకు గురైనపుడు అతని విజయం మనమీద సోకుతుంది. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.
1. ప్రారంభ విషయాలు
1. శోధనలకు ఆధారం : మత్తయి 4,1-11 క్రీస్తు శోధనలను వర్ణిస్తుంది. క్రీస్తు శోధనలను ఎవరూ కంటితో చూడలేదు. మరి ఆ వివరాలు సువిశేషకారులకు ఏలా తెలిసాయి? క్రీస్తే ఆ సంగతి శిష్యులతో చెప్పి వుండాలి. తొలినాటి అపోస్తలుల