3. ప్రవక్తలు
మామూలుగా ప్రవక్తలకు అభిషేకం లేదు. ఒక్క ప్రవక్త మాత్రం తాను అభిషేకం పొందినట్లుగా చెప్పకొన్నాడు. అతడు మూడవ యెషయా, ఇతడు "ప్రభువైన యావే నన్ను అభిషేకించి తన యాత్మతో నింపాడు. అదీ, పేదలకు సువార్తను ప్రకటించడానికి" అని చెప్పకొన్నాడు - యెష 61,1. నూత్నవేదంలో క్రీస్తు ఈ ప్రవచనాన్ని తనకు అన్వయించుకొన్నాడు — లూకా 4, 18. పూర్వవేదంలో మోషే తనలాంటి ప్రవక్త వొకడు మళ్ళా ఉద్భవిస్తాడని చెప్పాడు - ద్వితీ 18,15.
2 మెస్సీయా మూడు పనులు
పూర్వవేదంలో మొదట మెస్సీయా అనే మాటకు స్పష్టమైన భావాలు లేవు, కాలక్రమేణ ఆ పదం పరిణామం చెందుతూ వచ్చింది. క్రమేణ అతడు దేవుని ప్రతినిధిగా వచ్చి ఆ దేవుని కార్యాలు నిర్వహిస్తాడనే భావం ప్రచారంలోకి వచ్చింది. అతడు రాజు, ప్రవక్త యాజకుడు అనే మూడు భావాలు పూర్వవేదంలో తగులుతాయి. వీటిల్లో రాజు అనే భావానికి పూర్వవేదం ఎక్కువ ప్రాముఖ్యమిస్తుంది. కుమ్రాను భక్తులు ఇద్దరు మెస్సీయాలు వస్తారని భావించారు. వీరిలో ఒకడు రాజు, మరియొకడు ప్రవక్త.
నాతాను ప్రవచనం ప్రకారం మెస్సీయా దావీదు వంశంలో పడతాడు -2సమూ 7,12-16. యెషయా అతని రాకడను ముందుగా ఎరిగించాడు. "యువతి గర్భవతియై వుంది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడుతుంది" అన్నాడు - 7,14, జెకర్యా అతడు దీనుడుగా వస్తాడు అని చెప్పాడు.
“సియోను కుమారీ! సంతసించు
ఇదిగో నీ రాజు నీ చెంతకు వస్తాడు
గాడిదపై ఎక్కి వస్తాడు
గాడిద పిల్లపై ఎక్కి వస్తాడు"
అని నుడివాడు 9,9-10. కడన అతడు నూత్న వేదంలో యేసుక్రీస్తుగా అవతరించాడు. క్రీస్తునాడు పాలస్తీనా దేశం రోమనుల అధీనంలో వుంది. వారినుండి స్వాతంత్ర్యం పొందాలని యూదులు ఉబలాటపడుతుండేవాళ్ళు, కనుక మెస్సీయా, ప్రవక్త రాజు యాజకుడు ఐనా అతన్ని ప్రధానంగా రాజునిగానే భావించేవాళ్లు. అతడు రోమను ప్రభుత్వాన్ని కూలద్రోసి తమకు స్వాతంత్ర్యం సంపాదించిపెడతాడని యెంచేవాళ్లు. కనుక క్రీస్తునాడు మెస్సీయా అనే పదం రాజకీయ భావాలతో నిండివుండేది.
3. యేసే మెస్సీయా
యేసు పవిత్రతను బోధను అద్భుతాలను జూచి అతని సమకాలికులు అతన్ని క్రీస్తు అని పిలవడం మొదలెట్టారు. మెస్సీయావి నీవేనా అని అడిగారు- యోహా 10,24