రెండవది, లోకంలో అధికశాతం ప్రజలు పేదలు. వాళ్ళ తిండిలేక నానా యాతనలు పడుతున్నారు. కొద్దిమంది ధనికులు మాత్రం సంపదనంతా దక్కించుకొని రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఈలా కొద్దిమంది మాత్రమే సంపదలను చేజిక్కించుకొని అధికశాతాన్ని పేదలను జేయడాన్నే సాంఘిక అన్యాయం అంటాం. లోకంలో ఈ అన్యాయంలేని తావులేదు. ఇది ప్రాచీన కాలంనుండి వస్తూన్న పాపం. కనుక బైబులు ఈ యంశాన్ని తేపతేపకు గుర్తుకు తెస్తుంది. క్రీస్తు బోధల్లో కూడ ఇది ప్రముఖాంశమైంది. ధనవంతులు తమ భాగ్యాలను పేదలతో పంచుకోవడం ఎలా అన్నది నేడు ప్రపంచంలో ముఖ్య సమస్య.
4. శ్రమల సమస్య
క్రీస్తు బోధల్లో నాల్గవ అంశం ఈ లోకంలో నరులు అనుభవించే శ్రమలను గూర్చింది. ఈ విషయాన్ని గూర్చి క్రీస్తు అభిప్రాయాలు రెండున్నాయి. మొదటిది బాధలు చెడ్డవి. దేవుడు మనలను సంతోషించడానికి పుట్టించాడు గాని దుఃఖించడానికి కాదు. జీవించడానికి పుట్టించాడుగాని చనిపోవడానికి కాదు. మోక్షంలో సంతోషమేగాని దుఃఖం ఉండదు. జీవమేగాని మరణం ఉండదు. మృత్యువు, శ్రమలు పిశాచం తెచ్చి పెట్టినవి. అది శత్రువు చేసినపని. దేవునిసృష్టి అనే గోదుమచేలో పిశాచం శ్రమలు అనే కలుపు విత్తనాలు చల్లింది - మత్త 13,28. కనుక క్రీస్తు సాధ్యమైనంతవరకు ఈ శ్రమలను తొలగించాలని కోరుకొన్నాడు. అతడు స్వయంగా అద్భుతాలు చేసి ప్రజల ఆర్తిని తీర్చాడు. గ్రుడ్డివాళ్ళు దృష్టిని పొందుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు. కుష్టరోగులు శుద్దులౌతున్నారు. చెవిటివాళ్ళ వింటున్నారు. మృతులు పునరుత్తానులౌతున్నారు. పేదలకు సువార్త బోధింపబడుతూంది అని ప్రభువు యోహాను శిష్యులకు చెప్పాడు - మత్త 11,5. అంతేగాదు, ఈ పనులను చేయడానికీ క్రీస్తు తన శిష్యులనుగూడ పంపాడు. ఇప్పడు తిరుసభకూడ నరుల వ్యాధి బాధలను తొలగించడానికి తనవంతు కృషి తాను చేస్తుంది. నేడు ఆస్పత్రులద్వారా మన మఠకన్యలు చేసే వైద్యసేవకు పునాది ఈ సూత్రమే.
రెండవది, మనం తొలగించుకోలేని శ్రమలను దేవునిపై భారంవేసి మంచి మనసుతో స్వీకరించాలి. దేవుణ్ణి నమ్మినపుడు మనం వదలించుకోలేని శ్రమలను ఏదోవిధంగా భరించగల్లుతాం. దేవుడు పంపిన కష్టాలు మనకు ఏదోవిధంగా మేలుచేస్తాయి కూడ. క్రీస్తు స్వయంగా శ్రమలను ఆహ్వానించలేదు. తండ్రి పంపినపుడు వాటిని స్వీకరించాడు, అంతే క్రీస్తు స్వయంగా మరణం చెంతకు పోలేదు. సాధ్యమైనంతవరకు దాన్ని తప్పించుకో జూచాడు. నజరేతు పౌరులు ప్రభువుని కొండ శిఖరమునుండి క్రిందికి